నవాబ్పేట, మే 23 : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, లక్ష్మీనర్సింహ రెస్టారెంట్ యజమాని కావలి రవి కరోనా కష్టకాలంలో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. నేనున్నానంటూ ముందుకొచ్చి ప్రతిరోజూ రెండు పూటలా భోజనం అందిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో కరోనా బాధితులు కుటుంబాలకు దూరమయ్యారు. వారికి సకాలంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో రుద్రారం రవి ముందుకొచ్చి భోజనం అందిస్తున్నాడు. ఈనెల 13న కరోనా బాధితులకు భోజనం సరఫరా చేయడం ప్రా రంభించాడు. కరోనా సమయంలో తన రెస్టారెంట్ బంద్ ఉన్నప్పటికీ అక్కడే కరోనా బాధితుల కోసం భోజనం తయారు చేయించి మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నాడు. ప్రతిరోజూ సుమారుగా 40 నుంచి 50మందికి తన సొంత డబ్బులతో భోజనం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నా డు. ఆదివారం కూడా 50మందికి రెండు పూటలా భోజనం అందజేసినట్లు రవి తెలిపారు.