వనపర్తి, నమస్తే తెలంగాణ/వనపర్తి, జూన్ 21: వర్షాలు సకాలంలో పడకున్నా రాష్ట్రంలో సాగునీటికి ఫికర్లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మిషన్కాకతీయతో చేపట్టిన కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు, గోదావరి, కృష్ణానదుల నీటితో వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చని రైతులకు మంత్రి సూచించారు. పెద్దమందడి మండలం మంగంపల్లిలో సోమవారం మంత్రి నిరంజన్రెడ్డి 20మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేసి మాట్లాడారు. పేదలు ఆత్మగౌరవంతో ఉండాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. మరిన్ని ఇండ్లు మంజూరు చేయిస్తూ విడుతల వారీగా పేదలందరికీ అందజేస్తామన్నారు. మంగంపల్లి రూపురేఖలు మారాయని, మినీ లిఫ్టు ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతాంగానికి సేవలందిస్తున్న పెద్దజీతగాడినని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యేగా, వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి గ్రామం హరితవనం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిందని, మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కానుక ఇవ్వాలన్నారు. ఒక్కో వ్యక్తి బాధ్యతగా 10మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఒక్కొక్కరికీ సాలీనా రూ.1650ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ మెగారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి, సర్పంచ్ శారద, పార్టీ మండలాధ్యక్షుడు వేణు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జీవితం.. తెలంగాణకే అంకితం
ప్రొఫెసర్ జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జయశంకర్ సారు వర్థంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు జయశంకర్ జీవితం చాలించడం బాధాకరమన్నారు. 60 ఏండ్లపాటు తెలంగాణను జాగృతం చేయడం, సమైక్య పాలకుల దోపిడీని తెలంగాణ ప్రజలకు తెలియజేసిన మహనీయుడు అని గుర్తుచేశారు. ఆయన ఆకాంక్షల మేరకు తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు సత్యం, నాగన్నయాదవ్, జంపన్న, కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, కృష్ణ, మాజీ కౌన్సిలర్లు తిరుమల్, రమేశ్, నాయకులు ఉన్నారు.