వనపర్తి, ఏప్రిల్ 20: మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలోని సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి జాతీయ కర్మచారి కమిషన్ను ఏర్పాటు చేసిందని జాతీయ కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్జీ అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని 21వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్తో కలిసి ఆయన పర్యటించారు. అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సితార గార్డెన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బాబూ జగ్జీవన్రామ్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తకోట మున్సిపాలిటీలో కార్మికులకు గ్లౌజులు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ కార్డులు రాలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, వేతనాలు, కార్మికుల సంఖ్య పెంచాలని కార్మికులు కోరారు. సఫాయి కర్మచారి కమిటీలను వేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994లో కర్మచారి కమిషన్ ఏర్పాటైనా చైర్మన్ను నియమించలేదని, ప్రధానమంత్రిగా మోడీ ఎన్నికైన తర్వాత సఫాయి కర్మచారి చైర్మన్గా నియమించిన ఘనత ఆయనదే అన్నారు.
మహాత్మాగాంధీ మరుజన్మ ఉంటే సఫాయి కార్మికుడిగా పుడుతానని గాంధీ తెలిపారని ఆయన గుర్తు చేశారు. దేశంలో సఫాయి కర్మచారి పడుతున్న అవస్థలు, వారి సమస్యలపై కమిషన్ ఏర్పాటు చేసిందని ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సఫాయి కార్మికులు సూచించిన ప్రతి సమస్యనూ నోట్ చేసుకున్నామన్నారు. కార్మికులకు కావాల్సిన ఇన్సూరెన్స్ను గతంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో చర్చించామని, ప్రస్తుతం మంత్రికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. మంత్రి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో చర్చించి ఇన్సూరెన్స్ చేయిస్తామని వివరించారు. కొత్తకోట మున్సిపాలిటీలో కార్మికులకు కావాల్సిన కనీస సౌకర్యాలను రెండు రోజుల్లో కల్పించి అందుకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని కొత్తకోట మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు, సఫాయి కార్మికులు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్ చీర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.