ఇప్పటికే పూర్తయిన పదో తరగతి ఎఫ్ఏ-1
మార్కుల నమోదులో ఉపాధ్యాయులు బిజీ
తక్షణమే పూర్తి చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలు
కరోనా విస్తరణ నేపథ్యంలో రెండోసారి పాస్
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం అంత సులువుకాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గతేడాది తరహాలోనే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి 13,473మంది విద్యార్థులుండగా, ఇప్పటికే పరీక్ష ఫీజు కట్టినవారందరనీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోగా సెప్టెంబర్ నుంచి ఆన్లైన్, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. సిలబస్ కుదించి, ప్రశ్నాపత్రాల్లో సైతం మార్పులు చేశారు. టెన్త్లో పదకొండు పేపర్లను ఆరింటికే పరిమితం చేసి, వచ్చేనెల 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ కూడా ప్రకటించారు. పరీక్షా కేంద్రాలను పెంచి, కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. కాగా , కొవిడ్ విస్తరిస్తుండడంతో గతనెల 24 నుంచి బడులను మూసివేసి ఆన్లైన్ తరగతులకే పరిమితం చేసింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన, పరీక్షల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఎఫ్ఏ-1 మార్కులు కీలకం
వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులందరినీ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)మార్కుల ఆధారంగా అధికారులు గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో మార్చి 10న నిర్వహించిన ఎఫ్ఏ-1 మార్కులు కీలకం కానున్నాయని సమాచారం. ఇందుకోసం ఎఫ్ఏ-1 మార్కులను తక్షణమే ప్రభుత్వ పరీక్షల విభాగం(డీజీఈ)వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఎస్ఎస్సీ బోర్డు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఎంఈవోలను ఉన్నతాధికారులు కోరగా, వీరి ఆదేశాలతో ఆన్లైన్ చేసే పనిలో యంత్రాంగం బిజీ అయింది. ఇప్పటికే పలు పాఠశాలలు ఎఫ్ఏ-1 మార్కులు ఆన్లైన్ చేయగా మిగిలినవారంతా అప్లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
కరోనాతో రెండోసారి పాస్
కరోనా సంక్షోభంతో గతేడాది కూడా పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షలు కొనసాగిస్తుండగానే లాక్డౌన్ ప్రకటించడంతో వాయిదా వేశారు. మళ్లీ పరీక్షల ఏర్పాట్లకు సన్నాహాలు చేసినా, హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా రద్దు చేశారు. ఎఫ్ఏ మార్కుల ఆధారంగానే అందరినీ పాస్చేసి, గ్రేడ్లు కేటాయించారు. ఈ ఏడాది సైతం పరీక్షలు రద్దు చేయడం, పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయడం ఇది రెండోసారి కానుంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్పాడ్స్ మింగిన కుక్క.. ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు
బాబు రావాలి..రౌడీ కావాలి..గల్లీ రౌడీ టీజర్