మూడు రోజుల్లో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు
జిల్లా దవాఖానను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి, కలెక్టర్ శర్మన్
ఎంజేఆర్ ఆధ్వర్యంలో దవాఖానకు 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేత
నాగర్కర్నూల్, మే 16: జిల్లా దవాఖానకు మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సుధాకర్లాల్తో కలిసి జిల్లా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ ఏర్పాటయ్యే వరకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంజేఆర్ ట్రస్టు ద్వారా 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దవాఖానకు వచ్చే రోగుల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. దవాఖాన ముందుభాగంలో ఎమర్జెన్సీ విభాగం ఎదుట సీసీరోడ్డు వేయాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. అలాగే దవాఖానలో ఇంకా పెండింగ్లో ఉన్న ఆధునికీకరణ పనులు త్వరగా ప్రారంభం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వారి వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు.