ఖిల్లాఘణపురం, జూన్ 15 : ఈ ఏడాది హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని షాపూర్ గ్రామాల్లో నర్సరీ, ప్రకృతి వనాలు, ఖిల్లా ప్రభుత్వ దవాఖానను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టీకా వివరాలను వైద్యులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు తీస్తున్న గోతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల్లో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఖిల్లా దవాఖానలో ప్రతి రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కొవిడ్ టీకాను సూపర్ స్ప్రెడర్లకు విడుతల వారీగా వేస్తుందని తెలిపారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రోడ్డకు ఇరువైపులా మొక్కలు నాటాలి
గ్రామాల్లోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వనపర్తి-ఘణపురం ఆర్అండ్బీ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడానికి తీస్తున్న గోతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు గోతులను సిద్ధం చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆర్అండ్బీ రహదారి 66 ఫీట్ల విస్తీర్ణం ఉందని రహదారి స్థలంలోనే మొక్కలు నాటుతున్నామని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లోని నర్సరీలను ఆయన పరిశీలించారు. జంగమాయిపల్లి, వీరాయపల్లి వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారివెంట మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అఫ్జల్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.