వనపర్తి, జూన్ 15 : జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని ఇన్చార్జి ఎస్పీ సాయిశేఖర్ అన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తి స్థాయిలో రూపుమాపడంపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాల సరఫరా, నాసిరకం ఎరువులు కొనుగోలు, విక్రయాలు చేసే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందుకు స్థానిక పోలీసు, టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు వ్యవసాయ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద వ్యవసాయ శాఖ అధికారుల తోడ్పాటుతో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన నిఘా చేపట్టాలని ఆయన సూచించారు.
నకిలీ విత్తనాలను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. లేదా డయల్ 100, 08545-233331, టాస్క్ఫోర్స్ 7901117294కు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జమ్ములప్ప, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు ప్రవీణ్కుమార్, మల్లికార్జున్రెడ్డి, సీతయ్య, అగ్రికల్చర్ ఏవో రవికుమార్, టాస్క్ఫోర్స్ ఎస్సై సత్యనారాయణ, జిల్లాలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.