ఉమ్మడి జిల్లాలోని బీసీ గురుకుల కళాశాలలో 1,360 సీట్లు
అందుబాటులో వృత్తి విద్య కోర్సులు
21వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
వనపర్తి రూరల్, జూన్13: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను దశల వారీగా అమలు పరుస్తున్నారు. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను గణనీయంగా పెంచుకుంటూ వస్తున్నారు. గతంలో కన్న వందశాతం మెరుగైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారుతున్నాయి. పిల్లల భవిష్యత్తుకు బాటలు చూపిస్తున్నాయి. నమ్మకం పెరిగింది. వీటిలో సీటులు సాధించేందుకు పోటీ సైతం తీవ్రంగా ఉండడం గమనార్హం. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలల్లో చేరేందుకు గురుకులాల గత నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ మరోసారి ప్రభుత్వం విద్యార్థులకు జూన్ నెల 21వ తేదీ వరకు పొడిగించి అవకాశం కల్పించింది.
ఉత్తమ బోధన..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. వాటిలో బాలికలకు 9, బాలురులకు ఐదు కళాశాలలు ఉన్నాయి. ఆయా చోట్ల చేరే విద్యార్థులకు వసతి కల్పించడంతో ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కళాశాలలో బాలబాలికలకు కలిపి 1,360 సీట్లు ఉన్నాయి. ఒక్కోదానికి 80 చొప్పున కేటాయించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. భవిష్యత్తుకు ఉపయోగపడే వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఒకేషనల్ కోర్సులు
బీసీ గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులతోపాటు వృతి విద్య నైపుణ్య కోర్సులను కూడా కళాశాల స్థాయిలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. దీనిలో అగ్రికల్చర్, క్రాప్ ఫౌండేషన్, హార్టికల్చర్, నర్సింగ్, ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులను అందిస్తున్నది. విద్యార్థులు వీటిలో చేరడంతో విద్యార్థులకు భవిష్యత్తు ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది.
ఆన్లైన్లో దరఖాస్తు..
www.mjptbcwreis.telangana. gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా అందులోకి వెళ్లి ఈ-మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ నెల 21లోగా దరఖాస్తుతోపాటు రూ.200 పరీక్ష రుసుం చెల్లించాలి. పదో తరగతి వరకు బీసీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. బీసీ గురుకుల కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని, ఇంటర్ పూర్తయిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.