ఆత్మకూరు, జూన్ 10 : జల్సాలకు మరిగిన నలుగురు యువకులు బైకుల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన బోయ రమేశ్ అలియాస్ జహంగీర్ (22), శివకుమార్ అలియాస్ గైని శివ(19), తెలుగు ఆంజనేయులు(20), పీ రవి స్నేహితులు. వీరు కొంతకాలంగా ఆత్మకూరు మండలంతోపాటు ఇతర మండల్లాలోనూ దొంగతనాలు చేస్తున్నారు. గతంలో ఇంటి ఎదుట నిలిపి ఉన్న బైకులలో పెట్రోలు చోరీ చేయగా, కొన్నిరోజులుగా మోటర్బైక్లను చోరీకి పాల్పడుతున్నారు.ఆత్మకూరు, దేవరకద్ర మండలం వెంకటగిరి, అడ్డాకుల మండలం వర్ని, పెబ్బేరు మండలం రంగాపురం గ్రామాల్లో నాలుగు బైకులను చోరీ చేశారు. దొంగిలించిన బైకులను కొన్ని రోజులపాటు ఎవరికీ కనపడకుండా దాచిపెట్టి అమ్ముకుంటున్నారు. గురువారం ఉదయం ఆత్మకూరు చెరువుకట్టపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చోరీ చేసిన బైకుతో యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు బయటపడ్డాయి. నలుగురు నిందితుల్లో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని, మిగిలిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపా రు. సమావేశంలో సీఐ సీతయ్య, ఎస్సై ముత్తయ్య, ట్రైనీ ఎస్సైలు సందీప్, నాగరాజు సిబ్బంది ఉన్నారు.