20వార్డులకూ ప్రాధాన్యత కల్పిస్తాం
నూతనంగా బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు
ప్రతివార్డునూ శానిటైజ్ చేసి.. కరోనా నుంచి కాపాడుకోవాలి
విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, మే 7: అచ్చంపేట మున్సిపాలిటీని పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని, 20వార్డులకు సమ ప్రాధాన్యత కల్పించి పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్గా నర్సింహగౌడ్, వైస్ చైర్పర్సన్ పొరెడ్డి శైలజకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఒకవైపు కుట్రలు, కుతంత్రాలు, నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రజలు పట్టించుకోలేదన్నారు. చివరికు టీఆర్ఎస్నే ప్రజలు విశ్వసించి సీఎం కేసీఆర్, భవిష్యత్ నాయకుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని బలపర్చి ఆశీర్వదించారన్నారు. తాను బరిలో దింపిన అభ్యర్థులను గెలిపించిన పుర ప్రజలకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి మున్సిపల్పై గులాబీ జెండా రెపరెపలాడించిన అచ్చంపేట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం నడుంబిగిద్దామన్నారు. 20వార్డుల్లో గెలుపొందిన విజేతలకు తన సహకారం ఉంటుందన్నారు. కరోనా నియంత్రణను కలిసికట్టుగా ఎదుర్కొందామని, రెండురోజుల్లో అచ్చంపేటలోని 20వార్డుల్లో శానిటైజ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్పర్సన్ బాధ్యతగా శానిటైజ్ చేయించాలన్నారు. ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించి, మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించిన అధికారులను అభినందించారు. సమావేశంలో చైర్మన్ నర్సింహగౌడ్, వైస్ చైర్పర్సన్ శైలజ, కౌన్సిలర్లు మన్ను పటేల్, శ్రీను, లావణ్య, రమేశ్రావు, నిర్మల, ఖాజాబీ, మెరాజ్బేగం పాల్గొన్నారు.