వనపర్తి జిల్లాలో 1,32,214 జాబ్ కార్డులు
66,107 మంది కూలీలు
మంజూరైన పనులు 5,586, ఖర్చు అంచనా రూ.25లక్షల 750.03
పూర్తయిన పనులు 1,148, ఖర్చు రూ.2,749.60
వనపర్తి రూరల్, మే 22: ఉపాధి హామీ పథకం కింద పేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పనిలేదని దిగులు చెందకుండా కూలీ పనులు కల్పిస్తున్నది. లాక్డౌన్లో పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది. వనపర్తి జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో 255 పంచాయతీల్లో 1,32,214 కార్డులుండగా 66,107 మంది ఉన్నారు. వారిలో 26,699మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గ్రామాల్లోనే అడిగిన వారందరికీ ప్రభుత్వం పని కల్పిస్తున్నది. ప్రతి కూలీకి వందరోజుల పాటు పని కల్పించనున్నారు. గతంలో ఉపాధి పనులను క్షేత్ర సహాయకుల ద్వారా నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం వారిస్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పజెప్పి పనులు చేయిస్తుంది. జిల్లాలో వివిధ రకాల పనులను ఉపాధి హామీలో చేపట్టేందుకుగానూ 5,586 పనులను గుర్తించి, వాటి ఖర్చు రూ.25 లక్షల 750 అంచనా వేసినట్లు తెలిపారు. దానికి తగ్గట్టుగా కూలీలకు పనులు కల్పిస్తూ ఇప్పటివరకు 1,148 పనులు పూర్తి చేశారని తెలిపారు. గత నెలలో 15 శాతం పని దినాలను కల్పించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయిస్తున్నారు.
కూలీలతోపాటు రైతులకూ లబ్ధి
ఉపాధి పథకంతో కూలీలతోపాటు రైతులకూ లబ్ధిచేకూరుతున్నది. కాల్వల్లో పూడికతీత, నూతన కాల్వలు, చెక్ డ్యాంల నిర్మాణం, వరి, మిర్చి పంటలను ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణం, చెరువులు, కుంటల్లో పూడికతీత, రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు ఏర్పా టు, పిచ్చిమొక్కల తొలిగింపు పనులు ఉపాధి పథకంలో చేయిస్తున్నారు. కొత్త జాబ్ కార్డుల నమోదు, పని కావాలనే వారికి పని కల్పించేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకుంటున్నారు. కూలీలు చేసిన పనులను వెంటనే కొలతలు వేసి లెక్కలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ప్రతి కుటుంబంలో ఒకరికీ..
జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూలీలకు నిర్ధేశించిన పనిదినాలను కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఎంపీడీవోలు, ఎంపీవోల, ఏపీవోలతో సమీక్ష చేస్తూ ప్రతి రోజూ కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో 30 శాతం అదనపు భత్యం అందిస్తున్నాం. జాబ్కార్డు లేని వారు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. గుర్తించిన పనుల్లో 25 శాతం పూర్తయ్యాయి.