హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎస్పీ, కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా అప్రమత్తతలో జాతీయ సగటును మించి ఉన్నది తెలంగాణ రాష్ట్రమే అన్నారు.
కరోనా పరీక్షలు, టీకాలు, ఇతర అన్ని విషయాలలో తెలంగాణనే ఆధిక్యంలో ఉందన్నారు. మన రాష్ట్రంలో అందరికీ టీకా ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతం అన్నారు. కరోనా వాక్సినేషన్ను మనందరం ఒక యుద్ధంగా భావించి చేయించాలన్నారు. కఠినంగా వ్యవహరించి అయినా ప్రజలను అప్రమత్తం చేసి టీకాలు వేయించాలని చెప్పారు.
గ్రామాల్లో స్థానికంగా సామూహిక పండుగలు వద్దని చాటిచెప్పాలని సూచించారు. వాటిని అరికట్టకుంటే మనమందరం నష్టపోవాల్సి వస్తుందన్నారు. కుటుంబ శుభకార్యాలన్నీ పరిమితంగా చేసుకోవాలన్నారు. ఏదయినా ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులే బాధ్యత వహించాలని మంత్రి పేర్కొన్నారు.