ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా రాత్రి వరకు కూడా ఇదే స్థాయిలో ఇన్ఫ్లో నమోదయ్యింది. కడసరి సమాచారం అందేవరకు 1,06,468 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 16 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 65,152 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 640, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150, భీమా -2కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుతుత్పత్తికి 38,955 క్యూసెక్కులు విడుదల చేస్తుండ గా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతోంది.
ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.58 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 275,800 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.15 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 300.000 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది.
దిగువ జూరాలలో 300 మి.యూ ఉత్పత్తి జరిగిన నేపథ్యంలో విద్యుత్ ఇంజినీర్లు హర్షం ప్రకటించారు. ఒకరికొక్కరు అభినందనలు తెలుపుకుంటూ సంతోషం వెలి బుచ్చారు. ప్రాజక్టు పూర్తిసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయంత్రం 8.631 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజక్టు నుంచి 1,06,468 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది.