మలప్పురం, జూలై 10: ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పీకే వారియర్ (100) శనివారం కేరళలోని మలప్పురంలో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఆయన వైద్య సేవలు అందించారు. ఆయన వద్ద చికిత్స పొందినవారిలో భారత్తో పాటు ఇతర దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు కూడా ఉన్నారు. 1921, జూన్ 5న పుట్టిన పీకే వారియర్ (పన్నియంపిల్లి కృష్ణకుట్టి వారియర్) కొట్టక్కల్లో చదువుకున్నారు. తన 20వ ఏట కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో చేరి సేవలు అందించడం ప్రారంభించారు. ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించడంలో డాక్టర్ వారియర్ కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ప్రధానితో పాటు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరాయి విజయన్.. వారియర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.