సిమ్లా,జూలై 7:ప్రముఖ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశించింది. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రానా ప్రాంతంలో 2023-25 నాటికి మరో ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ఓకాయ సంస్థ తెలిపింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. అవియోనిక్ సిరీస్,క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ.60,000 వరకు ఉండనుంది. అత్యంత చౌక ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నసంస్థల్లో ఇది మొదటి సంస్థగా చెప్పుకోవచ్చు. 2025 నాటికి భారతీయ రోడ్లపై ఒక కోటి ఈ -స్కూటర్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓకాయా తెలిపింది. ఓకాయ ఈవీ స్కూటర్లు అతి త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.