సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి రూరల్, జూన్ 23: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం పరుచుకునేలా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ బండారి స్రవంతి అధ్యక్షతన చేపట్టగా, ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయ న మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టడంపై పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ప్రజలకు అవసరమయ్యే పండ్ల మొక్కలపై సర్వే చేయాలని, దానికి అనుగుణంగా పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రామాల్లో రహదారుల వెంట, ఖాళీ స్థలాలను చదును చేయించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా రక్షించాలని కోరారు.
అధికారుల మూలంగా ఇబ్బందులు
ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామస్థాయిలో పనిచేస్తున్న అధికారుల మూలంగా ప్రజాప్రతినిధులుగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెద్దపల్లి పీఏసీఎస్ చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. మరో సమావేశం నాటికైనా పరిస్థితి మెరుగు పడేలా చూడాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీడీవో రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
ఓదెల, జూన్ 23: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. ఓదెలలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగ్రోస్ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పనిముట్లు లభిస్తాయని వివరించారు. రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, వైస్ ఎంపీపీ పల్లె కుమార్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్, బోడకుంట చినస్వామి, కనికిరెడ్డి సతీశ్, నాగపూరి రవిగౌడ్, ఉపసర్పంచ్ తీర్తాల కుమార్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పోలోజు రమేశ్, నిర్వాహకులు తూడి సతీశ్, రాచర్ల నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.