అర్హులందరికీ అందేలా చూడాలి
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
మండల పరిషత్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం
జమ్మికుంట, జూన్ 23: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ముందుకుసాగుతున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని నిర్దేశించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి నివేదించిన వెంటనే నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. బుధవారం జమ్మికుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, మహిళా సమైక్య భవనాలకు సంబంధించిన నివేదిక తయారు చేసి అందించాలని కోరారు. కొత్తగా 623 రేషన్ కార్డులు, 237 కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు చెప్పారు. మంత్రి చేతుల మీదుగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ రాజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు లింగారావు పాల్గొన్నారు.