సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): గుట్కా, పొగాకు ఉత్పత్తులపై రాష్ట్రంలో నిషేధమున్నా.. కొందరు వ్యాపారులు అక్రమంగా దందా కొనసాగిస్తున్నారు. వీటిపై పోలీసులు పటిష్ట నిఘా ఉన్నా దొంగచాటుగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో నిషేధం విధించిన తరువాత గుట్కా తయారీ కేంద్రాలన్నీ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పరిసరాలకు తరలి వెళ్లాయి. అక్కడ తయారవుతున్న గుట్కా అడ్డదారుల్లో మన రాష్ర్టంలోకి వస్తుంది. కొందరు వ్యాపారులు నగర శివారు ప్రాంతాలను ఎంపిక చేసుకొని.. అక్కడ డంప్చేసి.. నగరంలోని కిరాణా దుకాణాలు, పాన్షాపులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నగరంలోని ఐదు జోన్లలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల నిఘాను పటిష్టం చేసింది. గురువారం ఒక్కరోజే సుమారు రూ. 20 లక్షలకుపైగా నిషేధిత సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళ్హాట్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.5 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. మంగళ్హాట్లో జైచంద్ జనరల్ స్టోర్స్ నిర్వాహకుడు రామ్ కిశోర్ కుమావత్, సంతోశ్ కిరాణా షాప్ యజమాని సతీశ్ బజాజ్, యూసుఫ్గూడలో సాయ నర్సింహా కిరాణా అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు సాయి బాబాలను అరెస్ట్ చేశారు.
ముషీరాబాద్కు చెందిన ప్రసన్నకుమార్ అశోక్నగర్ క్రాస్రోడ్డు ప్రాంతంలో నిషేధిత గుట్కా, పొగాకుతో కూడిన పాన్ మసాలలు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అతడి గోడౌన్పై దాడిచేసి అతన్ని అరెస్ట్చేసి.. రూ. 2 లక్షల విలువైన నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్, చిలకలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మోండామార్కెట్ ప్రాంతం, మార్కెట్ ప్రాంతం, వారాసిగూడలలోని కిరాణా, పాన్ షాపుల్లో గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3.65 లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చాంద్రాయణగుట్ట, మాదన్నపేట, కంచన్బాగ్ పోలీస్స్టేషన్ల పరిధిలోని చాంద్రాయణగుట్ట, గజిమిల్లత్ కాలనీ, మాదన్నపేట, హఫీజ్బాబానగర్లలో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి.. ఐదుగురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ. 9 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
చార్మినార్, జూన్ 11 : చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అజీం గుట్కాలు విక్రయిస్తుండగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అతని ఇంటిపై దాడి చేశారు. అదుపులోకి తీసుకుని.. 28 బ్యాగుల ఆర్ఆర్ ఖైనీ, 60బ్యాగుల కే-9000, స్వాగత్ ఖైనీ 3 బ్యాగులు..12 కాటన్ల సిగరెట్లు, 1 కాటన్ విన్ సిగరెట్లతోపాటు ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే.. ఒమర్ జుంబాలి ఇంటిపై దాడి చేసి.. అతన్ని అదుపులోకి తీసుకుని.. నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించడంతో అక్రమార్కులు అడ్డదారుల్లో నగరానికి తరలిస్తున్నారు. నగరంలోకి రవాణా కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటుండటంతో శివారు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. వారం, నెల రోజులకు సరిపోయే సరుకును ఒకేసారి తెచ్చి.. నగరంలోని కిరాణా, పాన్ షాపులకు కొంచం కొంచంగా సరఫరా చేస్తున్నారు. వీటిపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టి.. దందాకు పాల్పడేవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా నిషేధిత వస్తువుల విక్రయాలను గుర్తిస్తే వెంటనే స్థానికులు.. స్థానిక పోలీసులకు గానీ, డయల్ 100, 949061 6628కు సమాచారం ఇవ్వవచ్చునని టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు సూచించారు.