సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతుందనుకుంటే బ్లాక్ ఫంగస్ ఇప్పుడు వణికిస్తున్నది. కరోనా సోకి తగ్గిన వారిలో ఇది ప్రధానంగా కనిపిస్తోంది. తొలిదశలో విదేశాలకే పరిమితమై, మనదేశంలో కనిపించని ఈ ఫంగస్ రెండోదశలో పంజా విసురుతున్నది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. కొంతమందికి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత సోకుతుండగా, మరికొందరికి పాజిటివ్ ఉండగానే ఈ ఫంగస్ సమస్య తలెత్తుతున్నది. మొన్నటివరకు అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం, ఆక్సిజన్పై ఎక్కువకాలం చికిత్స పొందడం, షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వంటి ప్రధాన కారణాలతోనే ఈ బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్లు చాలామంది వైద్యులు, అధ్యయనాలు, సర్వేలు వెల్లడించాయి. కానీ తాజా అధ్యయనంలో అవన్నీ బ్లాక్ ఫంగస్కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. అంతేకాదు ఆక్సిజన్, షుగర్ స్థాయిలు అధికంగా ఉన్నవారికే ఈ ఫంగస్ సోకుతుందన్న వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్లో వస్తున్న కొత్త స్ట్రెయిన్ల ప్రభావమే బ్లాక్ఫంగస్కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి స్టెరాయిడ్స్ వాడని వారు, ఆక్సిజన్పై చికిత్స తీసుకోనివారు, షుగర్ సమస్య లేనివారు, హోం ఐసొలేషన్లో ఉన్నవారికి కూడా ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుంది. కరోనా మొదటిదశలో చాలామంది రోగులకు స్టెరాయిడ్స్ వాడాం. రోజుల తరబడి ఆక్సిజన్పై చికిత్స అందించాం. అప్పుడు ఏ ఒక్కరికి బ్లాక్ ఫంగస్ సోకలేదు. ఈ ఫంగస్ కేవలం సెకండ్వేవ్లోనే కనిపిస్తున్నది. అదికూడా కొంతమందిలోనే. అందరికీ ఏ రకం స్ట్రెయిన్ సోకిందో తెలుసుకోవడం కష్టం. బ్లాక్ ఫంగస్కు వైరస్లో వచ్చినే స్ట్రెయినే ప్రధాన కారణంగా అనిపిస్తున్నది. పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నది. -డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన