ధర్మపురి : జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొసునూరుపల్లెకు చెందిన ఉట్కూరు హన్మంతరెడ్డి (75) మే 7న కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారు. దీంతో ఆయనను చూసుకునేందుకు సింగపూర్లో ఉంటున్న తనయుడు గంగిరెడ్డి స్వగ్రామానికి చేరుకున్నాడు.
వైరస్ బారినపడ్డ హన్మంతరెడ్డికి దగ్గరుండి కొడుకు సేవలందించాడు. ఈ క్రమంలోనే గంగిరెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హన్మంతరెడ్డి మే 15న మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి సైతం విషమించడంతో శనివారం మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో తండ్రి కొడుకులు వైరస్ బారినపడి మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాదం అలుముకున్నది.