హైదరాబాద్ : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), జీహెచ్ఎంసీ సహకారంతో నగరంలోని బోరబండ సైట్-3లో గల నాట్కో ప్రభుత్వ పాఠశాలలో నాట్కో ట్రస్ట్ 40 పడకల కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ ఐసోలేషన్ సెంటర్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్కో ట్రస్ట్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. నగరంలో పలు కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలను తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు తెలిపారు.
హోం ఐసోలేషన్ వీలులేని వారు ఈ కమ్యూనిటీ సెంటర్లలోకి రావొచ్చన్నారు. 24 గంటల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులకు వేర్వేరు వార్డులు ఉన్నట్లు చెప్పారు. పోషకాహారం సమకూర్చబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 72073-22967 నెంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.