న్యూఢిల్లీ: మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులా..! అయితే, బ్యాంక్ చెక్ చెల్లింపుల్లో మార్పులు తీసుకొచ్చింది. సైబర్ లేదా ఇతర రకాల మోసాలను నివారించడానికి.. పాజిటివ్ పే కన్ఫర్మేషన్.. అనే నిబంధనను బ్యాంక్ ఆఫ్ బరోడా తప్పనిసరి చేసింది.
ఈ కొత్త పేమెంట్స్ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. ప్రాసెస్ చేయవలసిన చెక్ విలువ రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉంటే, చెక్ వివరాలను తప్పనిసరిగా పునఃనిర్థారించుకోవాలని తన ఖాతాదారులకు తెలిపింది.
ఖాతాదారులు, లబ్ధిదారులకు జారీ చేసిన చెక్ల గురించి ముందస్తుగానే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. తద్వారా సీటీఎస్ క్లియరింగ్లో కస్టమర్లకు సంప్రదించకుండా అధిక విలువ గల చెక్లను బ్యాంక్ ఆమోదిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాజిటివ్ పే కన్ఫర్మేషన్ ఎలా అమలవుతుందో చూద్దామా..
రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంతో జారీ చేసే చెక్లను నిర్ధారించుకోవచ్చు. మోడ్ ద్వారా ఒకసారి కన్ఫర్మేషన్ రిజిస్టర్ చేస్తే.. దాని సవరణకు గానీ, తొలగించడానికి గానీ వీలు లేదు.
ఒకసారి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సర్వర్కు డేటా సమర్పించాక, దాని సవరణకు అవకాశం లేదు. అయితే, బ్యాంకు ఖాతాదారులు జారీ చేసిన చెక్లు.. పేమెంట్ చేయకముందు, సీటీఎస్ క్లియరింగ్/కౌంటర్ వద్ద ఆపొచ్చు.
ఖాతాలో తగినన్ని నిధులు ఉండడంతోపాటు చెక్పై సంతకం తదితర వివరాలు పోవాలి. దీంతోపాటు సీటీఎస్కి అందించిన వివరాలు, వాస్తవ చెక్ వివరాలతో సరిపోలితే బ్యాంక్ అధికారులు ఆ చెక్ పాస్ చేస్తారు.
ఏదైనా ఛానల్ / మోడ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకు సమర్పించిన / ధృవీకరించిన వివరాలు తదుపరి క్లియరింగ్ సెషన్లోనే ప్రాసెస్ చేస్తారు. 6 గంటల తరువాత నిర్ధారించిన వివరాలు ఆ మరుసటి సెక్షన్లో ప్రాసెస్ చేస్తారు.
బ్యాంకు శాఖకు వెళ్లే వారు ఆ శాఖ పని వేళలకు అనుగుణంగా రిజిస్టర్ చేయాలి. ఇతర అన్ని మోడ్లు/ఛానళ్లు 24×7 అందుబాటులో ఉంటాయి. విజయవంతంగా సమర్పించిన ప్రతి ‘పాజిటివ్ పే కన్ఫర్మేషన్’ రిఫరెన్స్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది.
చెక్ ధృవీకరించినా, లేకున్నా, కస్టమర్లు చెక్ జారీ చేసే ముందు తమ ఖాతాలో సరిపడా నిధులు ఉండేలా చూసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్/నెట్ బ్యాంకింగ్, శాఖ సందర్శించడం, ఎస్ఎంఎస్, కాల్ సెంటర్లలో ఏదో ఒక విధానం ద్వారా కన్ఫర్మేషన్ కోసం వివరాలు పంపొచ్చు.
అయితే, కన్మర్మేషన్ కోసం వివరాలు పంపి మూడు నెలలు దాటిన చెక్లను అనుమతించరు. ఖాతాదారు తాను జారీ చేసిన చెక్లోని వివరాలను మరోసారి ధృవీకరించుకోవడమే.. పాజిటివ్ పే వ్యవస్థ.. ముఖ్యోద్దేశ్యం.
ఈ ప్రక్రియలో అధిక విలువతో కూడిన చెక్ను జారీ చేసినప్పుడు, చెక్లో పేర్కొన్న తేదీ, లబ్ధిదారుడి పేరు, జారీ చేసిన వారి పేరు, ఖాతా తదితర వివరాలు పాజిటివ్ పే వ్యవస్థ ద్వారా పునఃనిర్ధారిస్తారు. చెక్ జారీ చేసే వారు, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం మొదలైన ఛానెళ్ల ద్వారా ఎలక్ట్రానిక్గా చెక్లోని కనీస వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి.
ఈ వివరాలను సీటీఎస్ వద్ద సమర్పించిన చెక్తో క్రాస్ చెక్ చేస్తారు. ఆ చెక్లో ఏదైనా తేడా ఉంటే, దాన్ని బ్యాంక్ నిలిపివేస్తుంది.