గజ్వేల్అర్బన్/ చేగుంట/మెదక్ అర్బన్, మే 20 : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్రావు రైతులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామం వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనీఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆయన వెంట ఇప్కో డైరక్టర్ దేవేందర్రెడ్డి , రైతులు తదితరులు ఉన్నారు.
రైతుల సమస్యలపై మంత్రి ఆరా..
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు రైతు సమస్యలపై ఆరా తీశారు. గురువారం జిల్లా కేంద్రం మెదక్లో తమ కార్యక్రమాలను ముగించుకొని సిద్దిపేటకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో చేగుంటలో ఆగి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు సరిగా రావడం లేదని, రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు చేయడంతో ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందని రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, ఇబ్రహీంపూర్ వైస్ చైర్మన్ తానీషాతో పాట పలువురు రైతులు మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ హరీశ్తో మాట్లాడి, రైతులతో మాట్లాడించారు. మంత్రి ఆదేశాలతో మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ విజయలక్ష్మి రెడ్డిపల్లి సొసైటీతో పాటు రుక్మాపూర్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించారు. సంబంధిత రైస్ మిల్లర్లతో మాట్లాడి లారీలు పంపించే విధంగా చర్యలు చేపట్టడంతో మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
దళిత నాయకుడి మృతి పట్ల సంతాపం
గజ్వేల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గంట శంకరయ్య మృతి పట్ల మంత్రి తన్నీరు హరీశ్రావు సంతా పం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా గురువారం మృతి చెందిన అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గంట శంకరయ్య మృతి పట్ల మంత్రి హరీశ్రావుతో పాటు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. గంట శంకరయ్య గజ్వేల్ నియోజకవర్గంలో అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం గత 40 ఏండ్లుగా చేసిన సేవలు అభినందనీయమన్నారు. వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.