న్యూఢిల్లీ : ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమన్ నిధి’ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎనిమిదో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు నేరుగా జమకానున్నాయి. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతులు సాగుచేసే పంటలకు పెట్టుబడి సాయం కింద 2019లో కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాది రూ.6వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయాన్ని కేంద్రం విడుదల చేస్తోంది. అనంతరం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ రాష్ట్రాల రైతులతో మాట్లాడుతున్నారు.