మార్చిలో 22.4 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, మే 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండు నెలల విరామం అనంతరం మళ్లీ వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 22.4 శాతంగా నమోదైంది. తయారీ, గనులు, విద్యుత్తు రంగాల పనితీరు మెరుగుపడటం కలిసొచ్చింది. ముఖ్యంగా తయారీ రంగంలో 25.8 శాతం వృద్ధి కనిపించడం గమనార్హం. బుధవారం విడుదలైన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాల ప్రకారం గనుల రంగంలో ఉత్పత్తి 6.1 శాతం, విద్యుదుత్పత్తి 22.5 శాతం పెరిగాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ 41.9 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 54.9 శాతం, నాన్-కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్, 27.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. కాగా, నిరుడు మార్చిలో కరోనా ప్రభావం మధ్య ఐఐపీ -18.7 శాతంగా ఉన్నది. కాగా, మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఐఐపీ -8.6 శాతంగా ఉన్నట్లు ఎన్ఎస్వో వెల్లడించింది.
శాంతించిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో తగ్గుముఖం పట్టింది. గత నెల 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 4.29 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది.