కొల్లాపూర్ రూరల్, మే 11: ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో మందుబాబులు కొల్లాపూర్ పట్టణంలోని వైన్షాపుల ఎదుట మంగళవారం సాయంత్రం బారులు తీరారు. 10 రోజులేనా ఆ తర్వాత లాక్ డౌన్ను పొడిగించవచ్చనే సందేహంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు మద్యం బాటిళ్లను చంకనేసుకుపోతున్నారు. కొందరైతే బీరు కార్టన్లను తీసుకెళ్తున్నారు. బెల్టుషాపుల యజమానులు మాత్రం కార్టన్లకొద్దీ బీర్లు, విస్కీలు, చీప్లిక్కర్లు రేటు సపరేటైనా ఎగబడి తీసుకెళ్తున్నారు. లాక్డౌన్లో వైన్షాపులు మూసి వేస్తారని మందుబాబులు తప్పనిసరిగా బెల్టుషాపులను ఆశ్రయించకతప్పదు.
వారి వీక్నెస్ను ఆసరా చేసుకుని బెల్టుషాపుల యజమానులు ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచి వారి సొమ్మును దోచేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం వైన్షాపుల ముందు బారులు దీరి మరీ మందుకార్టన్లు తీసుకెళ్తున్నారు. కొల్లాపూర్ పట్టణానికి సమీపంలోని చుక్కాయిపల్లి, చౌటబెట్ల, అంకిరావుపల్లి, మాచినేనిపల్లి, కల్వకోలు, ముక్కిడిగుండం, మొలచింతపల్లి, నార్లాపూర్, ఎల్లూరు, అమరగిరి, సోమశీల గ్రామాల నుంచి అనేకమంది బెల్టుషాపులవారు తరలివస్తుండటంతో వైన్షాపుల ఎదుట బారులు తీరి కిక్కిరిసిపోవడంతో ప్రధాన రోడ్డు రద్దీగా మారింది. కొల్లాపూర్ పట్టణంలో మూడు వైన్షాపుల ఎదుట మద్యం కోసం జనం కిక్కిరిసిపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఎగబడిన మద్యం ప్రియులు
నాగర్కర్నూల్ టౌన్, మే 11: రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ ప్రకటించడంతో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. బుధవారం నుంచి మద్యం దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో మంగళవారం మధ్యాహ్నం కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఉదయం 6నుంచి 10 గంటల వరకే సమయం ఉండడం, ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచే వీలు లేకపోవడంతో ముందుగానే మేల్కొన్న మద్యం ప్రియులు పదిరోజులకు అవసరమయ్యే మద్యం తీసిపెట్టుకునేందుకు ఎగబడ్డారు. కొందరు యజమానులు ముందుగానే మేల్కొని దుకాణాలను మూసి వేయడంతో మద్యం ప్రియులు నిరాశతో వెనుదిరిగారు.
కల్వకుర్తిలో..
కల్వకుర్తి రూరల్, మే 11: ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ విధించడంతో కల్వకుర్తి పట్టణంలోని పలు మద్యం దుకాణాల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు.