కరీంనగర్ కార్పొరేషన్, మే 10 : టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎవరైనా సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచినవారేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి తాసిల్దార్ల కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ బొమ్మను, ఆయన చేసిన పనులను, కాళేశ్వరం జలాలను, రైతులకు ఇస్తున్న కరెంటును, గిట్టుబాటు ధర, కళ్యాణలక్ష్మి పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగాగ్జనసాగర్ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు సీఎం కేసీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని నిరూపించారన్నారు. మరో 20 ఏండ్ల వరకూ కేసీఆర్ శక్తి ముందు ఏ శక్తీ పని చేయదని ఉద్ఘాటించారు. తామంతా కేసీఆర్ సైనికులుగానే ఉన్నామని చెప్పారు. ఈటల రాజేందర్పై ఇప్పటివరకు ప్రభుత్వపరమైన చర్యలు మాత్రమే తీసుకున్నారని, పార్టీపరంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సమావేశంలో హుజురాబాద్కు చెందిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్ చిలుముల వసంతరామస్వామి, కాటండి మహేందర్, రాచపల్లి రాజయ్య, తిరుపతిరెడ్డి, సమ్మయ్య, వీరన్న, రాజారెడ్డి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.