సాహస క్రీడల రారాజుగా వెలుగొందుతున్న వాటర్ ఫాల్ ర్యాప్లింగ్పై రోజు రోజుకు యువతకు మక్కువ పెరుగుతు న్నది. జలపాతాలపై విన్యాసం చేయడ మంటే అషామాషీ కాదు. అలాంటి సాహస క్రీడ నేడు హాట్ టాపిక్ అయింది. కొవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్నందున బహిరంగ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలను వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ అసోసియేషన్లు రూపొందించాయి. ఈ ఏడాది నినాదం జలపాతాలను పరిరక్షించడం (సేవ్ వాటర్ ఫాల్).
డబ్ల్యూ.ఆర్.డబ్ల్యూ.సీ.ఓ.సీ. ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని జల పాతాలను పరిరక్షించండం. వీటిని అద్భుతమైన సాహస పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం. స్థానిక యువతకు ఆదాయ మార్గాలను కల్పించడం. ప్రపంచంలో వాటర్ఫాల్ ర్యాప్లింగ్ క్రీడలను ప్రోత్సహించి పోటీలను నిర్వహించడం. శిక్షకులను, పోటీలకు కావలసిన న్యాయ నిర్ణేతలను, బిలియెర్స్, టైం కీపర్స్, రెస్క్యూ టీమ్ను తయారు చేయడం. ఈ ప్రధానాంశాలతో డబ్ల్యూ.ఆర్.డబ్ల్యూ.సీ.ఓ.సీ. పనిచేస్తున్నది.
పంచంలోనే తొలిసారిగా 1994వ సంవత్సరంలో శ్రీశైలం కొండ కోనల్లో వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ ఆవిర్భవించింది. అడ్వంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏసీ ఏపీ), అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ (ఏసీఏటీ) వ్యవస్థాపకులు కె.రంగారావు తన బృందంతో శ్రీశైలం కొండల్లోని పాలధార, పంచధారకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 110 అడుగుల జలపాతంపై ర్యాప్లింగ్ చేశారు. దేశంలోనే ఇదే తొలి వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ ఈవెంట్. శ్రీశైలం కొండల్లోని జలపాతం పై ర్యాప్లింగ్ చేసిన ఏసీఏపీ బృందంలో ఉత్సాహం మరింత పెరిగింది. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ అభివృద్ధి చేస్తే సాహస పర్యాటకం పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఏసీఏపీ అం చనా వేసింది. సాహస పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వస్తాయని భావించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది.
ఎత్తయిన కొండపై నుంచి నిటారుగా వేగంగా కిందకు దిగడాన్ని ర్యాప్లింగ్ అంటారు. అదే ప్రక్రియ జలపాతాలపై చేస్తే వాటర్ఫాల్ ర్యాప్లింగ్ అని పిలుస్తారు. ర్యాప్లింగ్లోనే థ్రిల్ ఉంటే అద్భుతమైన జలపాతంపై ర్యాప్లింగ్ చేస్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో ఊహించవచ్చు.
జలపాతాలన్నీ ర్యాప్లింగ్కు అనుకూలం కాదు. జలపాతాల నీటి ప్రవాహ వేగం, ఎత్తు, స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్, ల్యాండింగ్, సేఫ్టీ ఇలాంటి అంశాలన్నీ అనుభవజ్ఞులైన శిక్షకులు ముందుగా పరిశీలించి ర్యాప్లింగ్కు అనుకూలంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలిస్తారు. కొన్నిసార్లు జలపాతం కొండ నుంచి రాళ్లపై పడే అవకాశం ఉంటుంది. శిక్షకులు వాటిని తొలగించి మార్గం రూపొందించి ర్యాప్లింగ్ కు అనుమతి ఇస్తారు. అడ్వాన్స్ టీమ్ సురక్షితమైన యాంకర్ పాయింట్లో ర్యాప్టింగ్ రోప్ కట్టడానికి పరిశీలించిన తర్వాత అనుభవజ్ఞుడైన శిక్షకుడు, ఫిక్స్ రోప్ ద్వారా మొత్తం జలపాతం మార్గాన్ని పరిశీలించి ఏదైనా లూజ్ బండరాళ్లు పడే అవకాశం ఉంటే వాటిని తొలగించి మార్గాన్ని సురక్షితం చేస్తా డు. పూర్తిగా కిందికి దిగిన తర్వాత ల్యాండింగ్ పాయింట్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ర్యాప్లింగ్ మొదలుపెడతారు.
ఈ అద్భుత సాహస క్రీడ గురించి 2010 వరకు రంగారావు బృందం పెద్దగా ఆలోచించలేదు. విశాఖ పట్నండ పెందుర్తి ప్రాంతానికి చెందిన ప్రెస్ ఫొటో గ్రాఫర్ ఎస్ఆర్సీ మోహనరావుతో కలసి రంగారావు తూర్పు కనుమల్లో జలపాతాల అన్వేషణ మొదలుపెట్టారు. బొర్రా గుహలకు ఆరు కిలోమీటర్లలో దూరంలో ఉన్న 450 అడుగుల ఎత్తయిన కటిక జలపాతం ర్యాప్లింగ్ చేయాలని పరిశీలించనప్పుడు పైకి వెళ్లేందుకు మార్గం కనుకోలేకపోయారు. ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్లాలని భావించి మరో ప్రయత్నంలో స్థానిక గిరిపుత్రుడు దండాపాడు గ్రామానికి చెందిన టైకూన్ (పెట్టిలి లైబాన్) సహాయం తీసుకొని జలపాతం పైకి మార్గాన్ని కనుగొన్నారు.
జలపాతం ఎత్తు కొలిచినప్పుడు అది సుమారు 450 అడుగులు వరకు ఉంది. ఈ సాహస కార్యక్రమాన్ని చేయాలంటే సుమారు ఆరు వందల అడుగుల తాళ్లు, ఇతర భద్రతా పరికరాలు అవసరమయ్యాయి. వాటిని సమకూర్చుకొని 2010 అక్టోబర్ లో ఆరుగురు సభ్యుల గల రంగారావు బృందం కటిక జలపాతం నుంచి ర్యాప్లింగ్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ ఫాల్ ర్యాప్లింగ్గా గుర్తింపు పొందింది. రికార్డు సెట్టర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కటిక జలపాతంపై 14 మంది సభ్యుల రంగారావు బృందం 2011 లో మరోసారి వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ చేసి తొమ్మది రికార్డులు నమోదు చేసింది. అది మొదలు రంగారావు బృందం వాటర్ఫాల్ ర్యాప్లింగ్కు పూర్తిగా అంకిత మైంది. కొత్త జలపాతాలను కనుకోవడం, ర్యాప్లిం గ్కు అనుకూలంగా ఉందో లేదో ఖరారు చేయడం వంటి వాటిపై ఈ బృందం దృష్టిపెట్టింది. 2012, 2016 సంవత్సరాలలో కటిక జలపాతంపై వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ నిర్వహించి 26 కొత్త రికార్డులను సృష్టించింది. విదేశీయులు సైతం ఈ సాహస క్రీడను వీక్షించారు.
రికార్డులతో నిలిచిపోకుండా ప్రపంచ స్థాయి వాటర్ఫాల్ ర్యాప్లింగ్ పోటీలు నిర్వహించాలని రంగారావు బృందం నిర్ణయించింది. రంగారావు, ఎస్ఆర్సీ మోహన్ సహా సీనియర్ జర్నలిస్ట్ ఎన్ఎన్ఆర్ ప్రధాన సభ్యులుగా ప్రపంచ వాటర్ఫాల్ ర్యాప్లింగ్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూ.ఆర్.డబ్ల్యూ. సీ.ఓ.సీ) ఏర్పాటైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా డబ్ల్యూ.ఆర్.డబ్ల్యూ. సీ.ఓ.సీ కార్యకలాపాలను ప్రారంభించింది. అదే ఏడాది కటిక జలపాతంపై ప్రపంచ పోటీలను నిర్వహించింది. విదేశీయులై పోటీల్లో పాల్గొన్నారు.
వయోపరిమితి లేకుండా ఔత్సాహికులు జలపాతాల ర్యాప్లింగ్లో పాల్గొనేవిధంగా ప్రోత్సహించి, సురక్షితమైన వాటర్ఫాల్ ర్యాప్లింగ్ను సాహస క్రీడగా ప్రపంచానికి పరిచయం చేయడం డబ్ల్యూ.ఆర్. డబ్ల్యూ.సీ.ఓ.సీ. ముఖ్య ఉద్దేశం
(వ్యాసకర్త: వ్యవస్థాపకులు; డబ్ల్యూ.ఆర్.డబ్ల్యూ.సీ.ఓ.సీ.)
కె.రంగారావు