ఐదు రెమ్డెసివర్ ఇంజక్షన్లతో పట్టుబడిన ముఠా సభ్యులు
నిందితులంతా ప్రైవేట్ దవాఖానల టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు
హన్మకొండ సిటీ, మే 8 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెడికల్ ఉద్యోగులు ఓ మాఫియాగా మారి, మార్కెట్లో చేస్తున్న ఆగడాలకు పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పోలీసులు నిరంతరం నిఘా పెట్టి కరోనా మెడిసిన్ను బ్లాక్లోకి తరిలించే ముఠా భరతం పడుతున్నారు. రెమ్డెసివర్ ఇంజక్షన్లు బ్లాక్లో విక్రయిస్తున్న ముఠాను శనివారం హన్మకొండ పోలీసులు అరెస్టు చేయగా ఏసీపీ జితేందర్రెడ్డి పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కరోనా సోకిన వారు కోలుకునేందుకు రెమ్డెసివర్ ఇంజక్షన్ అవసరం పెరుగడంతో మార్కెట్లో దాని కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్ మెడికవర్ దవాఖానలో పనిచేస్తున్న నల్లగొండ జిల్లా రామనాథపూర్కు చెందిన ఫార్మాసిస్టు ఎలిమినేటి నరేశ్, హైదరాబాద్ తారానగర్కు చెందిన కార్డియాలజీ టెక్నీషియన్ వాంకుడోత్ సందీప్, సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతంలోని ఎట్ లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కార్డియాలజీ టెక్నీషియన్గా పనిచేస్తున్న జంగిలి ప్రశాంత్, హన్మకొండ జయ దవాఖానలో పని చేస్తున్న నర్సంపేట మండలం గురిజాలకు చెందిన బొల్లం ఓంప్రకాశ్, కొక్కు ప్రశాంత్ ఓ ముఠాగా ఏర్పడి రెమ్డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయించి, సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారు పనిచేస్తున్న దవాఖానల నుంచి ఇంజక్షన్లను దొంగిలించి, శనివారం ఉదయం జయ హాస్పిటల్ ఎదుట రోగుల బంధువులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనుమానితులను పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్సై రఘుపతి, సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా రెమ్డెసివర్ బ్లాక్ దందా వెలుగులోకి వచ్చింది. వారి నుంచి ఐదు ఇంజక్షన్లతో పాటు రూ.24వేల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు రఘపతి, నవీన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, భాస్కర్, గౌస్పాషా పాల్గొన్నారు.