“మహమ్మారికి పరిశుభ్రతే మందు. ధైర్యమే దివ్య ఔషధం. రోగ నిరోధక శక్తి కీలకం. మరి వాటిని వందకు వందశాతం సరైన రీతిలో అందించే శక్తి ఎవరికి ఉంది? ఇంకెవ్వరికి ఒక్క మహిళకే. ఎంతో ఓర్పు, సహనంతో ఆమె పడే శ్రమ కరోనాను దరి చేరనివ్వకుండా అడ్డుకోగలుగుతుంది. గ్రేటర్ బిజీ లైఫ్లో చాలా మంది పురుషులు తమ పనులను విజయవంతంగా చేసుకోవడం వెనక ‘ఆమె’ ఉందన్న నమ్మకమే.”
“నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా.. నీ గాజుల చెయ్యి కదలాడకపోతే.. యే మనుగడ కొనసాగదుగా.. మగువా.. మగువా…. లోకానికి తెలుసా.. నీ విలువా..” అని సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట.. సమాజంలో మహిళా శక్తిని గుర్తు చేస్తోంది. వారు లేని సమాజాన్ని ఊహించలేం. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలోనూ.. వారి శ్రమ మాటల్లో చెప్పలేనిది. వారి కోసం తక్కువగా.. ఫ్యామిలీ కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తూ.. ఎప్పటిలాగే వారి ప్రేమకు, సహనానికి సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు. కరోనా యుద్ధంలో నగర మహిళలు కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్ తమ ఇంటి దరి చేరకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిదురించే వరకు.. నిరంతరం పనులు చేస్తూనే ఉంటున్నారు. ‘ఆమె’ ఉందన్న నమ్మకంతోనే కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది. కరోనాను తమ దరి చేరనివ్వదని విశ్వాసంతో కుటుంబం హాయిగా నిదురిస్తోంది. అదే నమ్మకం ఇంటి పెద్దను ఉపాధిపై దృష్టి సారించేలా చేస్తోంది. మొత్తంగా కరోనా విజృంభణ వేళ.. మహిళల పాత్ర అనిర్వచనీయమని పురుషులు ప్రశంసిస్తున్నారు.
ఎప్పుడూ ఉండే పనే.. కాని, ప్రస్తుత రోజులు వేరు. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. అడుగు బయట పెట్టాలంటే భయం. అది దరి చేరనివ్వకుండా కుటుంబాన్ని కాపాడటం ఓ సాహసమే. సాధారణంగా ఉదయం టిఫిన్ తయారీ.. మధ్యాహ్నం భోజనం.. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయడంలో గృహిణులు బిజీగా ఉంటారు. కాని, ప్రస్తుతం వారి పని రెట్టింపు అయింది. కరోనా వేళ అదనపు పనులు వారి వర్క్ లిస్టులో చేరాయి. సాధారణ వంటకాలు కాకుండా పోషక ఆహారాన్ని సమకూర్చే వంటకాల తయారీ, ఉదయం విభిన్న రకాల తేనీరు.. వేడీ నిమ్మ రసం, ఆవిరి పట్టడం.. తదితర పనులు జోడయ్యాయి. ఎవ్వరూ బయటకు వెళ్లి వచ్చినా ఇళ్లంతా మరోసారి పరిశుభ్రం చేయడం.. వారి బట్టలు ఉతకడం.. అదనపు పనిగా మారింది. పని మనుషుల సాయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో గృహిణుల శ్రమ గొప్పది. ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. తన ఊపిరి ఉన్నంత వరకు కుటుంబాన్ని అంటి పెట్టుకుంటూ సేవలు అందిస్తున్నారు మహిళలు.
“నగరానికి చెందిన ప్రవళ్లిక, భాగ్యలక్ష్మిలకు ఓ వైపు ఆఫీసు పని. ఇంకోవైపు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు. మరోవైపు ఇంటి బాధ్యత. వీటికి తోడు అతి పెద్ద యుద్ధం.. కరోనా దరిచేరకుండా చూడటం. వీటన్నింటిని తట్టుకుని నిలబడుతున్నారు. కొవిడ్ తమ ఇంటి వైపునకు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలతో కొవిడ్పై పోరాటం చేస్తున్నారు.” ఇలా నగరంలో ఎంతో మంది మహిళలు ఇంటికి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
“ఆమె పేరు జి.శిరీష, ఒక కూమార్తె, కుమారుడు ఆమెకు సంతానం. ఆమె కూతురు పనిచేస్తున్న ఆఫీస్లో తోటి ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రైమరీ కాంట్రాక్ట్లో ఉన్న శిరీష కుతూరు వెంటనే హోం ఐసోలేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లి శిరీష మనసు తల్లడిల్లింది. నిత్యం కూతురుని చూడకుండా ఉన్న తల్లి.. ఆరోగ్యంగా బయటపడాలని వరుసగా ఐదు రోజుల పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, ఇతర పోషకాహార వంటకాలు వండి పెడుతూ.. నిరంతరం ఆమెను జాగ్రత్తగా చూసుకుని అంటిపెట్టుకుని ఉంది. అమ్మ చేతి వంటలతో ఆమె ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా బయటపడింది.”
కరోనా నేపథ్యంలో ఎక్కువ శ్రమ పడుతున్నది గృహిణులే. ఇంట్లో మహిళలలే వైద్యులు. కషాయాలు తయారు చేస్తూ.. వేడి నీటిని అందిస్తూ, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పుక్కిలించేలా చేస్తూ.. వేడి నీటిని ఆవిరి పట్టించడం లాంటివి ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ కరోనాని పారద్రోలే ఆయుధాలే. మహిళలుగా ఏ స్థాయిలో ఉన్నా కుటుంబం కోసం ఈ పనులన్నీ చేయడానికి ఇష్టపడుతాం.- సీహెచ్ రాధ
కరోనా కష్ట సమయంలో మహిళలపై ఒత్తిడి పెరిగినా చాలా సానుకూల శక్తులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులలో రోగ నిరోధక శక్తిని పెంచే చిట్కాలను పాటిస్తున్నారు. ఇంట్లో మహిళలకు పురుషులు సహాయంగా నిలవాల్సిన సమయం ఇది. కరోనా వేళ పనులు రెట్టింపు అయ్యాయనేది వాస్తవం. మేం చేసే శ్రమకు గుర్తింపు రావాలని కోరుకోం. ప్రతి ఇంటికి ఓ మహిళ అండగా నిలబడుతుంది. కాబట్టే, వాళ్లంతా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. – జి.రేఖ.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. తన కుటుంబానికి ఏమీ కాకూడదనే స్వార్థం ప్రతి మహిళకు ఉంటుంది. అందుకే వారి కోసం నిరంతరం శ్రమిస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాలతో కూడిన వంటలు తయారు చేస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో రెస్ట్ తీసుకునే సమయం కూడా ఉండటం లేదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంది. బయటకు వెళ్లినా.. ఇంటికొచ్చినా.. శానిటైజింగ్ నుంచి బట్టలు ఉతకడం వరకు పనులు రిపీట్ అవుతూనే ఉంటాయి. పిల్లలు, వృద్ధులున్న ఇంట్లో వారి కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. – ఎస్.స్వాతి