పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొంత కాలంగా ఆయా గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో గ్రామపంచాయతీలు స్వచ్ఛంద లాక్డౌన్ను విధించాయి. పరిగి మండలం కాళ్లాపూర్, కులకచర్ల మండల కేంద్రంతోపాటు చౌడాపూర్, దోమ మండలంలోని మోత్కూర్, బాస్పల్లి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతుంది. నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం సమయంలో కొంతసేపు సడలింపు ఇచ్చి, తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. దీంతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేస్తున్నారు.
కులకచర్ల, చౌడాపూర్లో..
కులకచర్ల, మే 2 : కరోనా వైరస్ విజృంభిస్తున్నందున మండల కేంద్రంతో పాటు చౌడాపూర్ గ్రామంలో కూడా స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. కులకచర్ల మండల కేంద్రంలో వారం రోజుల నుంచి లాక్డౌన్ పాటిస్తుండగా చౌడాపూర్లో గురువారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం వేళలో మాత్రమే దుకాణాలు తెరిచి మధ్యాహ్నం నుంచి దుకాణాలు మూసి వేస్తున్నారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ రెండు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.