బెట్టింగ్ కోసం ప్రత్యేకంగా యాప్
సభ్యులుగా హైదరాబాదీయులు
బుకీలకు ఏజెంట్గా ఉన్న యువకుడు అరెస్టు
30 లక్షల సొత్తు స్వాధీనం
క్రికెట్ బెట్టింగ్ కోసం ముంబై బుకీలు హైదరాబాద్ పై కన్నేశారు. పందెం రాయుళ్లను ఆసక్తికరమైన ఆఫర్లతో ఆకట్టుకుంటూ జోరుగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ యాప్లో 15 లక్షల మంది పందెంరాయుళ్లు సభ్యులుగా నమోదయ్యారంటే బెట్టింగ్ దందాను ఏ విధంగా కొనసాగిస్తున్నారో స్పష్టమవుతున్నది. అయితే ముంబై బుకీలకు ఏజెంట్గా ఉన్న ఓ యువకుడిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్భగవత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన బంటు రాజేశ్ బీటెక్ (ట్రిపుల్ ఈఈఈ) చదివాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్కు వచ్చాడు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు పందాలపై దృష్టి పెట్టాడు. మొదటగా ఫెరారీ క్రికెట్ ఆన్లైన్ యాప్లో సభ్యుడిగా చేరిన రాజేశ్ అనేక మ్యాచ్లపై బెట్టింగ్లు పెట్టాడు. ఆర్థికంగా నష్టం రావడంతో అదే ఫెరారీ క్రికెట్ ఆన్లైన్ యాప్ నిర్వహిస్తున్న బుకీలకు ఏజెంట్గా మారాడు. కరీబీయన్ ప్రీమియర్ లీగ్, అస్ట్రేలియా బిగ్బాస్ టోర్నెమెంట్లపై బెట్టింగ్లు నిర్వహించాడు.