వరంగల్ టూ కరీంనగర్ సరఫరా
అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యాపారం
ఒక్కో ఇంజెక్షన్కు ఐదు రెట్ల ధర
రాంనగర్, ఏప్రిల్ 23 : రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టు రట్టయింది. శుక్రవారం కరీంనగర్ టాస్ఫోర్స్ పోలీసులు పట్టుకుని, కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీపీ కమలాసన్రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్లోని కిసాన్నగర్ ప్రాంతంలో నివసిస్తున్న దాసరి సురేశ్, ముకరంపుర ప్రాంతానికి చెందిన బాలగోని సత్యనారాయణ, కట్టరాంపూర్ ప్రాంతానికి చెందిన కొత్తకొండ వెంకటసాయిలు వరంగల్లోని ఒక దవాఖానలో పనిచేస్తున్న బొమ్మకంటి నరేశ్తో సంబంధాలను ఏర్పరచుకున్నారు. కరోనా వైరస్ సోకిన వారి చికిత్సకు అవసరమైన రూ. 5వేల విలువ గల ఒకో రెమ్డెసివిర్ ఇంజక్షన్ను వరంగల్ నుంచి కరీంనగర్కు సరఫరా చేస్తూ రూ.20 నుంచి 25 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా కొనసాగిస్తున్న అక్రమదందా సమాచారంపై పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్ఫోర్స్ పోలీసులు వలపన్ని కిసాన్నగర్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 18 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ దాడుల్లో పాల్గొన్న టాస్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బీ మల్లయ్య, కే సృజన్రెడ్డి, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విజ్ఞాన్రావు, టాస్ ఫోర్స్ ఎస్ఐ పీ కరుణాకర్, ఏఎస్ఐ నర్సయ్యతోపాటు వివిధస్థాయిలకు చెందిన పోలీసులను పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. కరోనా బాధితుల అవసరాలను ఆసరా చేసుకుని అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందులను ధనార్జనే ధ్యేయంగా అధికధరలకు విక్రయిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి దందాలు చేస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నామని, దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొన్ని దవాఖానలకు చెందినవారు ఈ ముఠా సభ్యులతో జతకడుతూ చికిత్సకు అవసరం లేకపోయినా సదరు మందులను రాయడంతోపాటు వైరస్ బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ భయాదోళనకు గురిచేస్తున్నారని, రసీదులు ఇవ్వకుండా ఎకువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అలా దందాలకు పాల్పడే దవాఖానలపై సంబంధిత అధికారుల సహకారంతో దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
నకిలీ శానిటైజర్ల దందా : పది నెలల్లో రూ 10 కోట్లకు స్కెచ్!
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి