కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల నేలకొరిగిన వృక్షాలు
తెగి పడిన విద్యుత్ తీగలు
ఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులు
నేలరాలిన మామిడికాయలు
లింగంపేట, ఏప్రిల్ 22 : కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కాతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి.
మండల కేంద్రంలో ఈదురు గాలులకు చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. మండల పరిషత్ కార్యాలయం కామారెడ్డి, ఎ ల్లారెడ్డి రహదారిపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్శాఖ సిబ్బంది వాటిని సరిచేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.
ఎగిరి పోయిన ఇంటి పైకప్పు
సదాశివనగర్, ఏప్రిల్ 22 : మండలంలోని భూంపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామానికి చెందిన గద్దల ఆగమయ్యకు చెందిన ఇంటి రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
నేలకొరిగిన భారీ వృక్షం
మాచారెడ్డి,ఏప్రిల్ 22 : మండలంలోని సోమార్పేట, బంజపల్లి, సర్ధాపూర్తండా గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీచడంతో పాటు భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిముద్దయ్యింది. బలమైన గాలులకు ఓ చెట్టు నేలకొరిగింది. మామిడి కాయలు నేలరాలాయి.