ఉపాధి కూలి పెంపు…
రూ.237ల నుంచి రూ.245లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
పెంచిన కనీస వేతనం ఏప్రిల్ 1 నుంచి అమలు
రంగారెడ్డి జిల్లాలో 2,88,580 మంది కూలీలకు లబ్ధి
వికారాబాద్ జిల్లాలో నాలుగు లక్షలకు పైగా కూలీలు
కొవిడ్తో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
45 ఏండ్లు దాటిన కూలీలందరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన
రంగారెడ్డి/వికారాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ కూలీలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకు రూ.237 ఉన్న కూలిని రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన మొత్తం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎండా కాలం కారణంగా ఇప్పటికే ఏప్రిల్, మే మాసాల్లో 30 శాతం ఎక్కువగా, జూన్లో 20 శాతం అదనంగా చెల్లించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. తాజా పెంపుతో రంగారెడ్డిలోని 2లక్షల 88వేలకు పైగా, వికారాబాద్లో నాలుగు లక్షలకు పైగా ఉన్న ఉపాధి కూలీలకు మరింత లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ ఉపాధి పనులను చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తమను ఆదుకోవడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శుభవార్త. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు అందజేస్తున్న కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నది. ఇప్పటివరకు ఉపాధి హామీ కూలీలకు అందజేస్తున్న రూ.237ల కనీస వేతనానికి రూ.8లను పెంచుతూ రూ.245లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21లో రూ.210లుగా ఉన్న కనీస వేతనాన్ని రూ.237లకు పెంచగా తాజాగా రూ.245లకు పెంచడంతో జిల్లాలోని ఉపాధి హామీ కూలీలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఇప్పటికే ఏప్రిల్, మే మాసాల్లో 30 శాతం అదనంగా, జూన్ మాసంలో 20 శాతం అదనంగా చెల్లించేందుకుగాను ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే ప్రతి కూలీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా మాస్క్ ధరించని కూలీలకు రూ.1000 జరిమానా విధించనున్నారు. 45 ఏండ్లు దాటిన కూలీలందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,57,952 జాబ్కార్డులుండగా 2,88,580 మంది కూలీలున్నారు.
రోజుకు 35 వేల మంది కూలీలు..
ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 35 వేలకు చేరింది. వారం రోజుల క్రితం రోజుకు 15 వేల మంది కూలీలు హాజరుకాగా ప్రస్తుతం ఏకంగా 20 వేల మంది కూలీలు పెరిగారు. పొలం పనులు పూర్తిగా అయిపోవడంతో కూలీల సంఖ్య భారీగా పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. మాడ్గుల మండలంలో 5975 మంది, తలకొండపల్లి మండలంలో 5578 మంది , ఇబ్రహీంపట్నం మండలంలో 4376 మంది, మంచాల మండలంలో 3793 మంది కూలీలు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా 530 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడు గుంతలు, నీటి ఊట గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అంతేకాకుండా అసైన్డ్ భూముల్లోని రాళ్లను తొలగించడం, భూమిని చదునుచేయడం, హద్దుల ఏర్పాటు, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు చేపట్టనున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట నూర్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వకం, నిరవదిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేపట్టారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం 80 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను రూ.112 కోట్ల చెల్లింపులు చేశారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 12,785 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. అత్యధికంగా మాడ్గుల మండలంలో 1601 కుటుంబాలు, యాచారం మండలంలో 1580, మంచాల మండలంలో 1299, కందుకూరు మండలంలో 1030 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 566 పంచాయతీల్లో లక్షా 87వేల 785 జాబ్ కార్డులకు.. 4లక్షల 23వేల 095 కూలీలు ఉన్నారు. ప్రస్తుతం లక్షా 25వేల 616ల జాబ్ కార్డులకు సంబంధించి 2లక్షల 50వేల 644 మంది కూలీలు ఉన్నారు. జిల్లాలో నిత్యం కూలీల సంఖ్య 80వేలకు పైగా దాటింది. గత రెండు వారాల క్రితం 50వేల మంది ప్రతి నిత్యం కూలీ పనులకు వస్తుండడంతో జిల్లా యంత్రాంగం మరింత మంది కూలీ పనులకు వచ్చే విధంగా అవగాహన కల్పించడంతో కూలీల సంఖ్య 80వేలు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరం కోటి 30లక్షల 94వేల 864రోజుల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళవారం ఒక్క రోజే జిల్లాలో 83వేల 600మందికిపైగా కూలి పనులు చేశారు. ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలకు పనుల వద్ద నీటి వసతితో పాటు అన్ని రకాలుగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. కూలీలకు అందించే సామగ్రి పంపిణీ చేశారు. ఒక్కో గ్రామంలో 1000 నుంచి 1500లకు పైగా కూలీలు పనులకు వెళ్తున్నారు.
అదనంగా వేసవి భత్యం..
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు వంద రోజులు పని కల్పించాలని అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశాయి. గత ఆర్థిక సంవత్సరం కూలీ రూ.235 ఇవ్వగా..ప్రస్తుతం ఆ రేటును రూ.245గా నిర్ధారించారు. తేలికపాటి నేలల్లో మినీ పర్క్లేషన్ ట్యాంకు, రాక్ ఫిల్ డ్యాంలు, ఎండిపోయిన బావుల రీచార్జి పనులకు క్యూబిక్ మీటర్కు రూ.178.06 ఇవ్వగా..ఆ మొత్తాన్ని రూ.196-రూ.218 వరకు పెంచారు. గట్టి నేలల్లో రూ.225-239, రాతి నేలల్లో రూ.264 వరకు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతర పనులకు సంబంధించిన ధరలను కూడా నిర్ణయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది.