చెన్నై : తమిళ సినీ నటుడు వివేక్ (59) శనివారం తెల్లవారు జామున చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వడపాలనిలోని సిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. ఇంటెన్సివ్ కేర్లో ఉంచి ఆయనకు మెరుగైన చికిత్స అందింస్తుండగా.. శనివారం తెల్లవారు జామున 4.35 గంటలకు కన్నుమూసినట్లు హాస్పిటల్ హెల్త్ బులిటెన్లో తెలిపింది. గుండెపోటు రావడంతో అతని భార్య, కూతురు శుక్రవారం ఉదయం 11 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న వివేక్ను హాస్పిటల్కు తరలించారు.
తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దాదాపు 300 సినిమాల్లో నటించాడు. 2009లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నాడు. వివేక్ తమిళ నటుడు అయినా ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలవగా.. ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందాడు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, విశాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన వివేక్ తమిళంలో టాప్ కమెడీయన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కొన్నాళ్ల క్రితం వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ మరణించడంతో ఆయన బాగా కుంగిపోయారు. త తర్వాత సినిమాలకు ఎక్కువగా చేయడం లేదు. గత గురువారం వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని.. ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
గుండెపోటుకు టీకాతో సంబంధం లేదని వైద్యులు తెలిపారు. తీవ్రమైన కార్డియోజెనిక్ షాక్తో కరోనరీ సిండ్రోమ్ కారణంగా అకస్మాత్తుగా వివేవ్కు గుండెపోటు వచ్చింది అని హాస్పిటల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజు శివస్వామి తెలిపారు. గురువారం ఆయన తీసుకున్న కోవిడ్ -19 వ్యాక్సిన్కు ఇది సంబంధం లేదని తెలిపారు. కరోనరీ సిండ్రోమ్తో ఓ నటుడు హాస్పిటల్లో చేరడం ఇదే మొదటి సారి అని శివస్వామి తెలిపారు. వివేవ్కు తేలికపాటి రక్తపోటు ఉందని పేర్కొన్నారు. వివేక్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.