వెల్లడించిన ఐఎండీ -తొలిసారిగా ప్రాంతాలవారీగా అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ ఏడాది వానాకాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు వ్యాపించే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి వర్షపాత అంచనాలను దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) పేరుతో శుక్రవారం విడుదల చేసింది. ఒడిశా, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయలో సాధారణం కన్నా కొంత తక్కువ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతాయని మొత్తంగా దేశమంతా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కాబట్టి వ్యవసాయ దిగుబడులు బాగా ఉండొచ్చని భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, ప్రాంతాల వారీగా ఐఎండీ వర్షపాత అంచనాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.