న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: చెక్బౌన్స్ కేసుల్లో విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీచేసింది. ఓ వ్యక్తిపై ఒక లావాదేవీకి సంబంధించి ఏడాది కాలంలో నమోదైన వివిధ చెక్బౌన్స్ కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ జరుపాలని పేర్కొంది. ఈ మేరకు ‘నెగొషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్’ చట్టానికి (ఎన్ఐ చట్టం) సవరణలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో 2019 డిసెంబర్ 31 నాటికి 35.16 లక్షల చెక్బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు గత మార్చిలో ఆందోళన వ్యక్తం చేసింది. సుమోటో కింద విచారణ చేపట్టింది. కేసుల పరిష్కారానికి తాజాగా సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్గదర్శకాలు జారీచేసింది. క్రిమినల్ కోర్టులపై భారం తగ్గేలా చెక్బౌన్స్ కేసుల విచారణపై హైకోర్టులు ట్రయల్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది. నిందితులకు సమన్లు పంపేందుకు గల కారణాలు నమోదు చేసేందుకు, నిందితుడు నేరం ఒప్పుకొంటే దోషిగా నిర్ధారించేందుకు అధికారాలు కల్పించాలని కోరింది. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 258కింద మేజిస్ట్రేటుకు లభించే అధికారాలు చెక్బౌన్స్ కేసులకు వర్తించవని పునరుద్ఘాటించింది. చెక్బౌన్స్ కేసుల్లో సాక్షులు ట్రయల్ కోర్టులకు అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందని నేరుగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.