ఉమ్మడి జిల్లాలో 10,921 మందికి ప్రయోజనం
రూ.2.18 కోట్ల ఆర్థిక సాయం, 273.25 టన్నుల బియ్యం
నేటి నుంచి టీచర్లు, సిబ్బంది వివరాల సేకరణ
20నుంచి పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు
వరంగల్రూరల్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ) : గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ఆపత్కాల ఆర్థిక సాయం, కుటుంబానికి నెలకు ఉచితంగా 25కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. శనివారం నుంచి ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది వివరాలను సేకరించనున్నారు. 16 నుంచి దరఖాస్తులను పరిశీలించి, 20 నుంచి అర్హుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరి కుటుంబానికి ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకు నెలనెలా రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైనవారు బ్యాంకు ఖాతా, ఇతర వివరాలతో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు.
నేటి నుంచి వివరాల సేకరణ
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నుంచి 15వరకు టీచర్లు, సిబ్బంది వివరాలు సేకరించాలని ఆదేశించారు. 16 నుంచి 19 వరకు దరఖాస్తులను పరిశీలించి, 20 నుంచి అర్హుల బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్లు, సిబ్బందికి ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా వారు పనిచేసే ప్రాంతంలో గానీ, సొంత ఊరిలో గానీ రేషన్ బియ్యం తీసుకునేలా చూస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం నిర్ణయం అభినందనీయం
మడికొండ : ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.2వేలు, 25కిలోల బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న టీచర్లకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. కరోనా సమయంలో మానవతా దృక్పథంతో సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం టీచర్లకు ఎంతో ఉపశమనం కలిగించినట్లయింది. విద్యావలంటీర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పీఈటీలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.
-పెరుమాండ్ల సాంబమూర్తి, బీసీటీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఉమ్మడి జిల్లాలో 10,921 మందికి లబ్ధి
ముఖ్యమంత్రి నిర్ణయంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే 10,921 మంది టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం కలుగనుంది. ప్రైవేట్ స్కూళ్ల వారీ వివరాలు సేకరిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో టీచర్, సిబ్బందికి నెలనెలా రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందజేయనుంది. ఈ ప్రకారం 9,890 మంది టీచర్లు, 1,031మంది సిబ్బందికి నెలనెలా రూ.2 వేల చొప్పున రూ.2,18,42,000 మేరకు ఆర్థిక సాయం అందనుంది. నెలనెలా 25 కిలోల లెక్కన 273.25 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్.. అదరగొట్టిన హర్షల్ పటేల్.. ముంబై స్కోరు 159
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి కరోనా