కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 7: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన చాంబర్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షను నిర్వహించారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. సరాఫరాలో అంతరాయం కలిగినా, పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో అంతర్గత పైప్లైన్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 11 నుంచి సింగూర్ నుంచి వచ్చే నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, బల్దియా చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, మిషన్ భగీరథ ఇంట్రా వర్క్స్ ఈఈ లక్ష్మీనారాయణ, ఈఈలు చౌదరిబాబు, నరేశ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో జిల్లా పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాల ద్వారా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అధికారులు, మిల్లర్లు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మిల్లర్లను ఆదేశించారు. ధాన్యాన్ని కచ్చితమైన ప్రమాణాలతో, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, రైతులు విక్రయించిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కొనుగోళ్లు, ధాన్యం మిల్లులకు చేరేవేసే విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లయి డీఎం జితేంద్రప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్రావు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, ఎఫ్సీ ఐ డివిజనల్ మేనేజర్ అశోక్కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీశంకర్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
కొనసాగుతున్న వ్యాక్సినేషన్, ర్యాపిడ్ టెస్టులు
మాస్కు ధరించకుంటే సరుకులు ఇవ్వొద్దు