నల్లగొండ, ఏప్రిల్ 1: జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తున్నది. రెండు, మూడు రోజులుగా సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం నుంచి వీస్తున్న వడగాలుల కారణంగా భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి చివరి నాటికి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రెండు, మూడు రోజులుగా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్నది. ఈ సీజన్లో గురువారం నల్లగొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా సూర్యాపేటలో 43 డిగ్రీలు నమోదైంది. దీనికి వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగలంతా అధిక ఉష్ణోగ్రతతో శరీరం మండుతుండగా రాత్రి పూట సైతం కనిష్ఠ ఉష్ణోగ్రతల్లోనూ పెద్దగా తేడా కనబడడం లేదు. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు బయటకు రాక పోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా దర్శన మిస్తున్నాయి.
మూడు రోజులుగా 42 డిగ్రీలకు పైనే..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మూడు రోజులుగా 42 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకానొక సందర్భంలో పగటి పూట 45 డిగ్రీల దాక నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ యంత్రాంగం చెబుతున్నది. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో పాటు గాలిలో తేమ శాతం కనిష్ఠ స్థాయిలో ఉండడంతో ఎండ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రభావం కనిపిస్తున్నది. సాధారణంగా ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి మే చివరి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండాల్సి ఉండగా ఈ సారి మార్చి చివరి నాటికే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అకాల వర్షం లేదు..
సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ ఆరంభం వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకొని కాస్త పెరుగుదల కనిపిస్తుంది. అయితే హోలీ సమయానికి ముందు లేదంటే తర్వాత అకాల వర్షంతో కాస్త వాతావరణం చల్లబడుతుంది. ఈ సారి వర్షం లేక పోవడంతో ఎండ తీవ్రత పెరుగుతుంది.
ఇవీ కూడా చదవండీ..
2జీ మిస్సైల్తో మహిళలను కించపరిచారు..
‘మార్కెట్లో గంటకు మించి గడిపితే రూ 500 జరిమానా’