వలస ప్రజలకు అమెరికా శుభవార్త
సరైన పత్రాలు లేకున్నా సిటిజన్షిప్
హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు, డ్రీమర్స్కు కూడా..
రెండు కీలక బిల్లులకు ప్రతినిధుల సభ ఆమోదం
లక్షలాదిమంది భారతీయులకు లబ్ధి
వాషింగ్టన్, మార్చి 19: తమ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే రెండు కీలకమైన బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన వారికి, వారి పిల్లలకు, వ్యవసాయ కార్మికులకు, హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించడమే ఈ రెండు బిల్లుల ముఖ్యోద్దేశం. 228-197 ఓట్ల మెజార్టీతో ఈ బిల్లులు ప్రతినిధుల సభలో గురువారం ఆమోదం పొందాయి. దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశగా ఇది అత్యంత కీలక ఘట్టమని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలను డ్రీమర్స్గా పిలుస్తారు. తాజా బిల్లుల ఆమోదంతో వీరికి చట్టబద్ధమైన నివాస హోదా లభించనున్నది.
చట్టంగా మారడం సులువే
తాజా బిల్లుల ఆమోదంతో భారతీయులకు ఎక్కువగా లబ్ధి చేకూరనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా దాదాపు 1.1 కోట్ల మంది నివసిస్తున్నారు. ఇందులో దాదాపు 5 లక్షల మంది భారతీయులు. హెచ్-1బీ వీసాతో అమెరికాలో ఉంటున్న వారి పిల్లలు.. 21 ఏండ్ల వయసులోపు వారైతేనే అక్కడ ఉండటానికి అనుమతి ఉంటుంది. అయితే తాజా బిల్లు ఆమోదంతో 21 ఏండ్లు దాటిన హెచ్-1బీ వలసదారుల పిల్లలకు పౌరసత్వం లభించడానికి మార్గం సుగమమైంది. ఈ రెండు బిల్లులు చట్టరూపం దాల్చాలంటే సెనేట్ ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. సెనేట్లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్నందున ఆమోదం సులువే. ‘కనీసం ఐదేండ్లపాటు చట్టపరంగా అమెరికాలో నివాసం (ఎల్పీఆర్) ఉంటున్న వారు ఇకపై పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బేరా అన్నారు.