పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకూ ప్రతిపాదనలు
పీవీ నర్సింహారావు వర్సిటీ వీసీ రవీందర్రెడ్డి
కూసుమంచి, మార్చి 18: తెలంగాణ ఏర్పడిన తరువాత తీసుకున్న అనేక నిర్ణయాలతో వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాల్లోనూ సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, ముఖ్యంగా పశు, మత్స్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ వీ.రవీందర్రెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రంలో గురువారం మహిళల శిక్షణ ముగింపులో పాల్గొన్న ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మత్స్య పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని, వాటి ఉత్పత్తి పెంచటానికి అనేక రాయితీ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. దీంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
టెన్త్ తర్వాత రెండేళ్ల కోర్సు..
రాష్ట్రంలోనే ఏకైక మత్స్య పరిశోధనా కేంద్రం పాలేరులో ఉందని, ఇక్కడ అన్ని అవకాశాలూ ఉన్నాయని, అందుకే ఇక్కడ పారాఫిషరీస్ కాలేజీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు పదో తరగతి తరువాత ఈ సబ్జెక్టులో రెండేళ్ల కోర్సు చేయవచ్చని అన్నారు. పాలేరులో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు విషయం తన దృష్టికి వచ్చిందని, దాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిస్తానని అన్నారు. మొదటిసారిగా వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల ఏర్పాటు చేశామని, ఆ విద్యార్థులు ప్రస్తుతం పాలేరులో శిక్షణ పొందుతున్నారని అన్నారు. ఇది తెలంగాణలో మొదటి బ్యాచ్ అని చెప్పారు.
మత్స్య ఉత్పత్తులపై అవగాహన..
మత్స్య ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని, అందుకే వాటి విషయంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని వీసీ తెలిపారు. మత్య్స ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువగా అవసరాలు ఉన్నాయని, వాటిని గుర్తించి తగిన విధంగా ఉత్పత్తుల తయారీకి గ్రామీణ మహిళలకు శిక్షణ ఇస్తామని, ఉత్పత్తులకు కావాల్సిన పరికరాల కోసం సుమారు రూ.1200 ఇస్తున్నామని వివరించారు. సైంటిస్టు విద్యాసాగర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.