మల్లాపూర్, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరునుంది. మల్లాపూర్ డివిజన్ సర్వే నంబర్ 109లో సెల్లార్ ప్లస్ 9 అంతస్తులు, మొత్తం 3 బ్లాకుల్లో 396 గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నివాస అవసరాలను గుర్తించి ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో చిన్న గదులతో నిర్మించిన ఇండ్లతో లబ్ధిదారులకు సరిపడక నానా ఇబ్బందులుపడ్డారు. పేద ప్రజల అవస్థలను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రవేశపెట్టింది. అన్ని సౌకర్యాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డబుల్ ఇండ్లను నిర్మిస్తున్నారు.
ఈ రోజుల్లో పేద ప్రజలు స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం భారంగా మారింది. అధిక భారంతో సొంతిళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబాల పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని వారి కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. చాలా ప్రాంతాల్లో డబుల్ ఇండ్లు నిర్మించి అర్హులైన వారికి అందజేయడం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సకల హంగులు.. అన్ని వసతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి. స్థానికంగా, మల్లాపూర్లో నివసించే అర్హులైన వారికి ఈ ఇండ్లు చెందే విధంగా అధికారులు, ప్రజా ప్రతి నిధులు చూడాలి. – పీఆర్. నాగరాజు, స్థానికుడు
మల్లాపూర్ డివిజన్లో నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 3 బ్లాకులలో 396 గృహాలు నిర్మిస్తున్నాం. 6 నెలల్లో డ్రైనేజీ, మంచినీటి పైపులైను, రోడ్లు, గార్డెన్తో సహా అన్ని పనులు పూర్తి చేస్తాం. ఆరు నెలల్లో లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. – ధర్మారెడ్డి, హౌసింగ్ డీఈ