కచ్చితమైన తూకాలు, పారదర్శకంగా విక్రయాలు
ఖమ్మం ఏఎంసీలో రెండేళ్లుగా అమలు
రాష్టంలోనే తొలి మార్కెట్గా అరుదైన రికార్డు
మరికొద్ది రోజుల్లో వ్యాపారులకు మొబైల్యాప్
ఖమ్మం వ్యవసాయం, మార్చి 16 : ఉమ్మడి రాష్టంలోనే ఈబిడ్డింగ్ విధానం అమలులోకి తీసుకొచ్చిన ఖమ్మం మార్కెట్ నాటి నుంచి నేటి వరకు సాంకేతిక పరిజ్ఞానంలో సత్తా చాటుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ మార్కెట్ విధానం (ఈ నామ్) గడిచిన ఐదేళ్ల నుంచి పత్తి, అపరాల క్రయవిక్రయాల్లో అమలు చేస్తోంది. స్థానిక ఖరీదుదారులు ఈ నామ్ మొదటి దశకు సంబంధించి ఆన్లైన్లో బిడ్ చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంటను అమ్ముకున్న రైతులకు ఆన్లైన్ తక్పట్టీల జారీ విధానం అమల్లోకి తీసుకొచ్చినైట్లెంది. అయితే, మిర్చి క్రయవిక్రయాల్లోనూ ఈ విధానం అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వేమెన్ ఇంటిగ్రేషన్ను అమలు చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల నుంచి మిర్చి క్రయవిక్రయాల్లో ఆన్లైన్ పద్ధతి ద్వారా కాంటాల ప్రక్రియ జరుగుతున్నది. తద్వారా రైతులకు ఆన్లైన్ పట్టీలను మార్కెట్ కమిటీ అందజేసేందుకు మార్గం సుగమమైంది.
గేట్ ఎంట్రీ నుంచి తోలకాల వరకు..
మిర్చి క్రయ, విక్రయాల్లో అందుబాటులోకి వచ్చిన తెలంగాణ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఎక్సేంజ్ (ఈ టామ్) విధానం ద్వారా గేట్ ఎంట్రీల నుంచి తోలకాల వరకు నమోదవుతోంది. రైతు పంటను యార్డులోకి తీసుకొచ్చే తరుణంలోనే ఆయా గేట్ల వద్ద రైతు పేరు, గ్రామం, ఫోన్నంబర్, పంట రకం, బస్తాల సంఖ్యను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో జెండాపాట వరకు ఎంతమంది రైతులు ఏఏ రకం పంటను తీసుకొచ్చారు. పంట వివరాలతోపాటు లాట్ల సంఖ్య తెలిసిపోతుంది. కాంటాల ప్రక్రియ ఎంత వరకు జరిగింది. అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. కాంటా ప్రక్రియ ముగిసిన మరుక్షణం ఆన్లైన్లో అప్పటికప్పుడు తెలిసిపోవడంతోపాటు రైతుకు పూర్తి వివరాలతో కూడిన రశీదును దడవాయిలు అందజేస్తున్నారు. వేమెన్ ఇంటిగ్రేషన్ విధానం అమల్లోకి రావడంతో నిత్యం రాష్ట్ర మార్కెటింగ్శాఖ అధికారులు తమ కార్యాలయాల్లో, మొబైల్ ద్వారా క్రయ విక్రయాల సరళిని తెలుసుకుంటారు. డైరెక్టర్ స్థాయి నుంచి అడిషనల్, జాయింట్ డైరెక్టర్లు సైతం ఖమ్మం ఏఎంసీ మిర్చి క్రయవిక్రయాలను అక్కడి నుంచే పరిశీలించవచ్చు.
త్వరలో వ్యాపారులకు మొబైల్ యాప్
రాష్టంలోనే ఆటామ్ విధానం మిర్చి క్రయవిక్రయాల్లో అమలు చేస్తున్న ఏకైక మార్కెట్గా ఖమ్మం మార్కెట్ గుర్తింపు పొందింది. దీని ద్వారా కార్మికులకు, రైతులకు మేలు చేకూరుతుంది. వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మార్కెటింగ్శాఖ మరో నిర్ణయం తీసుకున్నది. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్ పరిధిలోని కమీషన్, ఖరీదుదారులకు మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఈ ఆర్పీ సొల్యూషన్ రూపొందించిన ఈ టాప్ విధానంలో మొబైల్యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విజయవంతంగా అమలు చేస్తున్నాం
మిర్చియార్డు, పత్తి క్రయవిక్రయాల సరళిని నిరంతరం రాష్ట్ర మార్కెటింగ్శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మిర్చి క్రయవిక్రయాల్లో వేమెన్ ఇంటిగ్రేషన్ విధానం అమలు చేస్తున్న ఏకైక మార్కెట్ ఖమ్మం మాత్రమే. దడవాయిలకు శిక్షణ ఇవ్వడంతోపాటు సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండడంతో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం.
తూకాల్లో తేడా రావద్దనే
గతంలో కాంటాల ప్రక్రియ చేతిరాతలు ఉండడంతో సమస్యలొచ్చాయి. కొందరు వ్యాపారులు ఇష్టారీతిన తూకాలు కట్ చేశారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక పరిజానం వినియోగించుకొని జీపీఆర్ఎస్ విధానం అమల్లోకి తీసుకొచ్చాం. రైతులకు తూకాల కటింగ్ సమస్యకు చెక్ పడింది. 100 గ్రాములు కూడా తేడా రాకుండా బస్తా బరువు ఆన్లైన్లో నమోదు అవుతుంది.
-మద్దినేని వెంకటరమణ (ఖమ్మం ఏఎంసీ చైర్మన్)