హాంకాంగ్: ఈ-కామర్స్ కం టెక్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు.. అయినా ఆయనకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సర్కార్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి.. దీనికి కారణాలేమిటి?.. ఎందుకు జాక్మా కష్టాల్లో చిక్కుకున్నారు.. నేపథ్యం ఏమిటి? ఒకసారి తెలుసుకుందాం..
గతేడాది అక్టోబర్ నెలాఖరులో చైనాలో జరిగిన ‘ది బండ్ సమిట్’ లో చైనా ఆర్థికశాఖ అధికారులు, నియంత్రణ నిబంధనల తీరును జాక్ మా తూర్పారబట్టారు. లౌక్యంగా మాట్లాడుతూనే నేరుగా ఆయన విమర్శలు గుప్పించారు.
వాటిని అధికారులు జీ జిన్పింగ్ ద్రుష్టికి వెళ్లారు. అసలే దేశ శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన జిన్పింగ్.. తన వ్యతిరేకులను వెంటాడుతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.. దీంతో యాంట్గ్రూప్ ఐపీవోలో లోపాలను వెతికిపట్టాలని నియంత్రణ సంస్థలను ఆయన ఆదేశించారని గతేడాది నవంబర్లో వాల్స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
చైనా అధికారులు యాంట్ గ్రూప్ కొన్ని నిబంధనలను ఉల్లంఘించిందనే కారణం చూపారు. దీంతో అప్పటికే ఆలీబాబా అనుబంధ ఆంట్ గ్రూప్ ప్రతిపాదించిన ఐపీవోను సరిగ్గా రెండు రోజుల ముందు షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ సస్పెండ్ చేసింది.
అక్కడి నుంచి జాక్మాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఐపీవో నుంచి భారీగా అంటే దాదాపు 36 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకోవాలన్న జాక్ మా ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఐపీవో ముగిస్తే కంపెనీ విలువ కూడా 350 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్ల మధ్యకు చేరేదని అంచనా.
ఆలీబాబా అనుబంధ యాంట్గ్రూప్ విలువ సుమారు 200 బిలియన్ డాలర్లు ఉంటుందని చైనా అధికారులు లెక్క గట్టారు. ఐపీవోని నిలిపివేసి దాన్నిపునర్వ్యవస్థీకరించిన తర్వాత వేసిన లెక్కగా తేల్చారు. వాస్తవానికి యాంట్ మూడేండ్ల క్రితం 14 బిలియన్ డాలర్ల నిధుల సేకరించినప్పుడు చూపిన 150 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే.
ఐపీవోను అడ్డుకొని పునర్వ్యవస్థీకరణకు ఆదేశించినప్పుడు యాంట్ గ్రూప్ భారీగా విలువ కోల్పోతుందని అధికారులు భావించారు. ఈ పునర్వ్యస్థీకరణతో యాంట్ గ్రూప్పై చైనా నియంత్రణ సంస్థలు మరింత పట్టుబిగించనున్నాయి. అమెరికాకు చెందిన ఓ సంస్థకు యాంట్లో వాటాలు ఉన్నాయి.