కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గుర్తు తెలియని వ్యక్తులు నెట్టేయడంతో ఆమెకు తీవ్ర గాయాలైన విషయం విదితమే. దీంతో గురువారం కాళీఘాట్లో విడుదల చేయాల్సిన పార్టీ మేనిఫెస్టో కార్యక్రమం వాయిదా పడింది. మమత కోలుకున్న తర్వాతే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. నందిగ్రామ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కారు ఎక్కుతున్న మమతను కొందరు నెట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.