ప్రముఖ సంఘ సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వినుతికెక్కిన సావిత్రీబాయి ఫులే 1897 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్లో జన్మించిన సావిత్రీబాయి.. భర్త సహకారంతో విద్యాభ్యాసం గావించారు. అహ్మద్నగర్లో అమెరికన్ మిషనరీ నడుపుతున్న టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరారు. అనంతరం పుణెలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. సావిత్రీబాయి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, హెడ్మాస్టర్గా చరిత్రకెక్కారు. 1851 లో భర్త సహకారంతో పుణెలో సొంతంగా మూడు పాఠశాలలను ప్రారంభించిన పేదలకు చదువులు చెప్పడం ప్రారంభించారు.
కులతత్వం, పితృస్వామ్యంతో పోరాడిన సావిత్రీబాయి.. ఆడపిల్లలకు విద్య అవసరం గురించి సమాజాన్ని చైతన్యవంతం చేశారు. విద్యావేత్తగానే కాకుండా కవిగా పేరుగాంచిన ఈమె.. వివక్ష, కుల దురాగతాలు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా కవితలు రాశారు. తన జీవితాన్ని మహిళల హక్కులు, విద్య కోసం అంకితం చేశారు. ఆమె వారసత్వం నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉండటం విశేషం.
జ్యోతిరావ్ ఫులేను 10 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. 13 ఏండ్ల వయసులో సంఘం నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నప్పటికీ, మహిళల విద్యపై దృష్టి పెట్టింది. తన భర్తతో కలిసి భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించిన తరువాత అలాంటి 18 పాఠశాలలను ప్రారంభించారు. వితంతువులకు శిరోముండనం చేయడానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి ఆధునిక భారతీయ స్త్రీవాదులలో సావిత్రీబాయి ఒకరు.
అత్యాచార గర్భిణి బాధితుల కోసం ఆమె కేర్ హబ్ను తెరిచింది. వారు ప్రసవించడానికి మద్దతు ఇచ్చింది. సావిత్రీబాయి, ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ 1897 లో పుణెలో బుబోనిక్ ప్లేగు మహమ్మారి బారిన పడిన వారికి చికిత్స అందించడం కోసం క్లినిక్ ప్రారంభించారు. ప్లేగు రోగికి సేవ చేస్తున్నప్పుడు ఆమె స్వయంగా ఈ వ్యాధి బారినపడి.. 66 సంవత్సరాల వయసులో మరణించారు.
సామాజికంగా అంటరానివారు అని భావించే ప్రజల కోసం ఆమె తన సొంత ఇంట్లో బావిని తవ్వించింది. సావిత్రిబాయి తన భర్తతో కలిసి సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ముఖ్యంగా కట్నం లేకుండా వివాహాలు నిర్వహించడానికి ఈ సమాజ్ ద్వారా విశేష సేవలందించారు. ఈమె గౌరవార్ధం 1998 లో భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంపును తీసుకువచ్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2006: పాకిస్తాన్ నగరమైన క్వెట్టాలో ల్యాండ్మైన్ పేలుడు, 26 మంది దుర్మరణం
2006: మార్స్ చుట్టూ ప్రదక్షిణ చేసి గ్రహం మీద నీటి కోసం అన్వేషణ ప్రారంభించిన నాసా ప్రయోగించిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్
2002: పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ ఉద్యమంపై నిషేధం ఎత్తివేత
1998: ఇండోనేషియా సుహార్టో వరుసగా ఏడవసారి రాష్ట్రపతిగా ఎన్నిక
1977: యురేనస్ గ్రహం చుట్టూ రింగులు కనుగొన్న శాస్త్రవేత్తలు
1970: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జననం
1969 : మార్టిన్ లూథర్ కింగ్ హంతకుడు జేమ్స్ ఎర్ల్ రే కు 99 ఏండ్ల జీవితఖైదు విధింపు
1945: కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా జననం
1922: దేశ ద్రోహ ఆరోపణలపై మహాత్మా గాంధీ అరెస్టు చేసిన బ్రిటిష్ సేనలు
1876: తన సహోద్యోగి థామస్ వాట్సన్తో టెలిఫోన్ ద్వారా తొలుత మాట్లాడిన గ్రాహంబెల్
1801: గ్రేట్ బ్రిటన్లో మొదటి జనాభా లెక్కలు ప్రారంభం