న్యూఢిల్లీ: తమ వద్ద తాకట్టులో ఉన్న పలు ఆస్తులను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శుక్రవారం వేలం వేయనున్నది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్నిరకాల ఆస్తులను విక్రయించనున్నట్లు తెలిపింది. వీటిలో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ఎస్బీఐ ఒక ట్వీట్లో పేర్కొంది.
ఎవరైనా ఈ బిడ్లో పాల్గొనవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సోషల్ మీడియా వేదికల్లో ప్రచురించింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా శాఖల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.
ఈ బిడ్లో పాల్గొనేవారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్ డిపాజిట్ ఆఫ్ మనీని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సదరు బిడ్డర్ సంబంధిత శాఖలో కేవైసీ పత్రాలను సమర్పించాలి. బిడ్లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్దగానీ, మరెవరైనా గుర్తింపు పొందిన ఏజెన్సీ నుంచి కానీ డిజిటల్ సిగ్నేచర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ, కేవైసీ పత్రాలు సమర్పించాక బిడ్లో పాల్గొనేవారికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను ఎస్బీఐ పంపిస్తుంది.