వనపర్తి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)/గద్వాల/మహబూబ్నగర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. సమైక్య పాలన లో అస్తిత్వం కోల్పోయిన బతుకమ్మ పండుగకు సీఎం కే సీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తీ సుకొచ్చింది. ప్రజలు పేదరికంతో పండుగకు దూరం కా కూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో బతుకమ్మ పండుగలో భాగంగా 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరెలు పంపిణీ చేస్తున్నది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న అ ర్హులైన మహిళలందరికీ అందమైన చీరెలను అందజేస్తుండడం విశేషం. పరోక్షంగా చేనేత కార్మికులు చీరెల తయారీతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. చీరెలను పలు ప్ర భుత్వ శాఖల సమన్వయంతో పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేశారు. పౌరసరఫరాల శాఖ, రేషన్ డీ లర్, సెర్ఫ్, మెప్మా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యుల సహకారంతో పంపిణీ చేయనున్నారు. రేషన్కార్డులో పేరు నమోదు ఉంటేనే ఆధార్కార్డు నిర్ధారణతో చీరెలను పంపిణీ చేయనున్నారు. ఇందుకుగానూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఇంటా ఘనంగా పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో యువతులు, మహిళలకు చీరెలను పంపిణీ చేస్తున్నది.
శనివారం నుంచి అధికారులు చీరెలను అందజేయనున్నారు. ప్రకృతి పండుగ అయిన బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రత్యేకంగా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. ప్రకృతిని దైవంగా ఆరాధి స్తూ.. తీరొక్క పూలతో తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ. 18 ఏండ్లు నిండి తెల్లరేషన్ కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న యువతులు, మహిళలకు చీరెలు పంపిణీ చేసేందుకు పౌ ర సరఫరాల, చేనేత, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెల పంపిణీతో పేద కుటుంబాల మహిళల్లో ఆనందం కనిపిస్తున్నది. ప్రధానంగా చేనేత కార్మికులను దృష్టిలో ఉంచు కొని ఉచితంగా చీరెలు పంపిణీ చేయాలన్న నిర్ణయం తీ సుకున్నది. చీరెలన్నింటినీ ఆయా చేనేత సంఘాల ద్వా రా కొనుగోలు చేసి మహిళలకు అందిస్తున్నది. ఇన్నాళ్లూ ఆదరణ లేక నలిగిన చేనేత కార్మికుడు ఆర్థికంగా నిలుదొక్కుకునే చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 30 రకాల డిజైన్లతో 20 రంగుల్లో చీరెలను ఆడబిడ్డలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి పంపిణీ..
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరెల పంపిణీకి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చీరెలు జిల్లా కార్యాలయాల నుంచి మండల కేంద్రాలకు, గ్రామాలకు చేరుకున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. గతంలో మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ఐకేపీ అధికారులు, పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో పంపిణీని పర్యవేక్షించన్నారు. చీరెల పంపిణీ సక్రమంగా జరిగేలా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గ్రామ స్థాయిలో కమిటీలుఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, గ్రామైక్య సంఘం బాధ్యురాలితో ఏర్పాటైన కమిటీతోపాటు పర్యవేక్షణ అధికారి సమక్షంలో అర్హులైన మహిళలకు చీరెలు పంపిణీ చేయనున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా 3,09,160 చీరెలు అవసరమని అధికారులు నివేదిక పంపగా, మొదటి విడుతగా 2.35 లక్షల చీరెలు వచ్చాయి. వీటిని బండమీదిపల్లిలోని మహిళా సమాఖ్య భవనంలో భద్రపరిచారు. అక్కడి నుంచి మండల కేంద్రాలను సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ చీరెల పంపిణీని ప్రారంభించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ చీరెలు అందజేయనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,10,666 మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద ఉన్న ఆహారభద్రత కార్డుల నమోదును బట్టి వివరాలు సేకరించారు. జిల్లాలో 333 చౌకధర దుకాణాలున్నాయి. జిల్లాకు చేరుకున్న చీరెలను మండలాలు, గ్రామాలకు సరఫరా చేశారు.
వనపర్తి జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన 2,22,628 మంది లబ్ధిదారులకు చీరెలు పంపిణీ చేయనున్నారు. 14 మండలాల్లోని 325 రేషన్ షాపుల ద్వారా అందించేందుకు రెవెన్యూ, సివిల్ సైప్లె అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేసి.. ఓ అధికారిని ఇన్చార్జిగా నియమించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వం సూచించింది. కాగా, మొదటి దశగా జిల్లాకు 1.54 లక్షల చీరెలు వచ్చాయి. వీటిని ఇప్పటికే మండలాలు, గ్రామాలకు సరఫరా చేశారు. మిగిలిన వారికి రెండో దశలో అందజేయనున్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్డ్డి చీరెల పంపిణీని ప్రారంభించనున్నారు.